ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో వేసవి ప్రారంభంలోనే కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. ఆదివాసీ గిరిజనులు కిలోమీటర్ల దూరం కాలినడకన బిందెలు తీసుకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. బావులు అడుగంటి ప్రమాదకరంగా ఉన్నా.. గొలుసుకట్టుగా ఉండి బిందెడు నీటి కోసం సహవాసం చేస్తున్నారు. మహిళలు కూడా ప్రాణాలకు తెగించి నిచ్చెన ద్వారా బావి లోపలికి దిగి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గం చూపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 3 : గట్టేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో తీవ్ర తాగు నీటి ఎద్దడి నెలకొంది. ఈ కొలాంగూడ గ్రామంలో 24 కుటుంబాలు, 105 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో బోరు బావులు, చేతి పంపులు ఉండగా అడుగంటాయి. తాగునీటి ఎద్దడి ఏర్పడక ముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే.. ఈ దుస్థితి వచ్చేది కాదని కొలాం గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు వదులుకుని తాగునీటి సేకరణకు వెళ్తున్నారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
మిషన్ భగీరథ నీరు అందించాలి..
కొలాంగూడలో తాగునీటి సమస్య వేధిస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా నీరు వారానికి ఒకసారి మాత్రమే అందుతున్నాయి. మిగతా రోజుల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తున్నది. బావులు అడుగంటడంతో ప్రాణాలకు తెగించి నీటిని తోడుకొస్తున్నాము. బోర్లు వేసినా నీరు రావడం లేదు. ప్రస్తుతం అయితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు మిషన్ భగీరథ నీరు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
– కొడప సోనిబాయి, కొలాంగూడ.