ఆదిలాబాద్ రూరల్, జూన్ 19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యావిధానంలో సమూల మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ దీటుగా మారాయి. పచ్చదనం, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, శుద్ధమైన తాగునీరు, ఇంగ్లిష్ మీడియం బోధనతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో కళకళలాడుతున్నాయి. కొన్నిచోట్ల సీట్లు నిండిపోయాయి అనే బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం గ్రామాల నుంచి పట్టణాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ పాఠశాల పదో తరగతి ఫలితాల్లో పది సంవత్సరాలుగా 90 శాతంపైగా ఉత్తీర్ణత సాధిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న విద్యా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ మండలంలోని చాంద(టీ) జడ్పీహెచ్ఎస్ పాఠశాలపై కథనం..
పాఠశాలలో 160 మంది విద్యార్థులు..
చాంద(టీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం కొనసాగుతున్నది. విద్యార్థుల కోసం అనువైన ప్రయోగశాలలు ఉన్నాయి. విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
మన ఊరు-మన బడి కింద అభివృద్ధి
మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు అమర్చడం, పాఠశాలకు రంగులు వేశారు. అలాగే శుద్ధజలం, బాలబాలికలకు ప్రత్యేక మూత్రశాలల సౌకర్యం కల్పించారు. ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల చదువుల గురించి వివరిస్తున్నారు. ఎస్సీ, బీసీ, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లు విద్యార్థులకు వచ్చేలా చూస్తున్నారు. అదేవిధంగా బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్యను పెంచారు.
మరింత ప్రగతి
చాంద(టీ) జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో మెరుగైన బోధన జరుగుతున్నది. ఇంగ్లిష్ మీడియం కావడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని మన ఊరు-మన బడి కింద కేటాయించిన నిధులతో పాఠశాలకు సౌకర్యాలు కల్పించుకున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం.
-జీ శశికళ, ప్రధానోపాధ్యాయురాలు, చాంద(టీ) జడ్పీహెచ్ఎస్
పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం
పాఠశాల పచ్చదనంతో నిండి ఆహ్లాదక వాతావరణంతో ఉత్సాహవంతంగా ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు. జాతీయ పండుగ సందర్భాల్లో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటాపాటలలో కూడా మా పాఠశాల స్ఫూర్తిగా నిలిచింది. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మా పాఠశాలలో అందుబాటులో ఉన్నాయి.
– టీ లక్ష్మి, విద్యార్థి, జడ్పీహెచ్ఎస్, చాంద