భీంపూర్, ఫిబ్రవరి28: క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది , ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి గ్రామం ముక్రా(కే) అవుతుందని, ఆ దిశగా కంకణబద్దులమవుదాయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపు నిచ్చారు. భీంపూర్, కరంజి(టీ), టేకిడి రాంపూర్, గుబ్డి పంచాయతీలను కలెక్టర్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్లతో కలిసి మంగళవారం సందర్శించారు. గుబ్డిలో గ్రామసభ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరుచేసిందన్నారు.
సెగ్రిగేషన్ షెడ్లలో వర్మీ కంపోస్టు తయారు చేసుకోవాలన్నారు. గుబ్డిలో కొంతమంది రైతులకు పట్టాలు రద్దయిన విషయం సర్పంచ్ ఎల్పుల ప్రతాప్యాదవ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలిస్తామన్నారు. గుబ్డి ప్రకృతివనం బాగుందని ప్రశసించారు. కరంజి(టీ)లో 40 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు, బృహత్వనం బాగున్నాయన్నారు. భీంపూర్లో సబ్మార్కెట్యార్డు, జూనియర్ కళాశాల కోసం సర్పంచ్ మడావి లింబాజీ విజ్ఞప్తి చేశారు. అక్కడి పీహెచ్సీ జాతీయస్థాయి ఖ్యాతి గురించి వైద్యాధికారి విజయసారథి వివరించారు. బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. డీపీఆర్వో భీమ్ కుమార్ తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఆర్ డీఈ శివరాం, సర్పంచ్లు జీ స్వాతి క, రేఖ, నాయకులు జీ నరేందర్యాదవ్, కుడి మెత గంగారాం, శ్రీనివాస్యాదవ్, జాదవ్ రవీందర్, ఆకటి నరేందర్రెడ్డి, కపిల్ ఉన్నారు.
పట్టణ సుందరీకరణకు సహకరించాలి
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 28 : ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. పట్టణంలోని 3, 34, 35, 37 వార్డుల్లో మంగళవారం పర్యటించారు. పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణంలో సుందరీకరణ పనులు, పట్టణ ప్రగతి పనులు చేపడుతున్న దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీల్లో చెత్త, ప్లాస్టిక్ పడేయవద్దని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తే అపరాధ రుసుము వసూలు చేస్తామని తెలిపారు. కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపట్టే వారు నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ రోడ్లపై వేస్తే నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ సిబ్బంది తమకు కేటాయించిన వార్డుల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు.కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శైలజ, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, కౌన్సిలర్లు, సిబ్బంది, పాల్గొన్నారు.