ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పుతోంది. కొద్దో గొప్పో పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తుల, అసమ్మతుల, రెబల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఆదిలాబాద్, బోథ్, ముథోల్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన ముఖ్య నాయకులు తిరుగుబావుటా ఎగురవేస్తుండగా.. కొందరు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఆదిలాబాద్లో సంజీవ్రెడ్డి, బోథ్లో వన్నెల అశోక్లు రెబల్స్గా నామినేషన్ కూడా దాఖలు చేశారు. ముథోల్కు చెందిన కిరణ్ కొమ్రేవార్, ఆసిఫాబాద్కు చెందిన మర్సుకోల సరస్వతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరితోపాటు చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఎవరికీ మద్దతు తెలుపాలో తెలియక నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. దీనికితోడు కాంగ్రెస్ నాయకుల చిల్లర రాజకీయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్లలో నామినేషన్ వేయడానికి జనాన్ని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇవ్వకపోవడం, భోజనంపెట్టక పోవడంతో అభ్యర్థుల ఇంటి ఎదుటే ధర్నాకు దిగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంకా.. హస్తం నేతలు గొడవలు, బెదిరింపులు, కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఈ చర్యల ఫలితంగా చేతిలో ఏం లేదని తేలిపోతున్నది.
– మంచిర్యాల, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దో గొప్పో ఓట్లు పడుతాయనుకున్న నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పట్టు కోల్పోతోంది. ఎన్నికలకు 20 రోజుల సమయ మే ఉన్నప్పటికీ అసమ్మతి మంటలు చల్లారడం లేదు. టికెట్ ఆశించి భంగపడిన వారితో కాంగ్రెస్కు టెన్షన్ మొదలైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు సాజిద్ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ్రెడ్డి రాజీమానాలు చేశారు. రేవంత్రెడ్డి పైసలకు టికెట్ అమ్ముకున్నారని.. పార్టీ కోసం కష్టపడిన మా ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేసేవాళ్లమంటూ ప్రెస్మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రెబల్గా సంజీవ్రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.
ఆ మేరకు ఆయన నామినేషన్ వేయడంతో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. బోథ్ లో ముందు కాంగ్రెస్ టికెట్ను వన్నెల అశోక్కు ఇచ్చారు. అక్కడి స్థానిక నాయకుల తిరుగుబాటుతో మళ్లీ ఆడె గజేందర్కు కేటాయించారు. దీం తో వన్నెల అశోక్ రెబల్గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. దీంతో రెంటికీ చెడ్డరేవడిలా కాంగ్రెస్ తయారైంది. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంచి పేరున్న నాయకుడిగా ఉన్న కిర ణ్ కొమ్రేవార్ టికెట్ రాకపోవడంతో రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. టికెట్ ఆశించి మరో నాయకుడు విజయ్కుమార్ రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అదే జరిగితే ఈ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అత్యంత వివాదాస్పదంగా మార్చిన సీటు చెన్నూర్లో పోటీ చేసే అభ్యర్థి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పైసలు పంచుతూ, నాయకులను కొనుగోలు చేస్తే సరిపోతుందనుకున్న ఆయనకు అసమ్మతి నాయకుల తీరు మింగుడు పడడం లేదు. మాజీ మంత్రి బోడ జనార్దన్, మరో నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ రాజీనామాలు చేసి, బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు వారి వర్గానికి చెందిన నాయకులు రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతుండడంతో వారిని బుజ్జగించే పనిలో వివేక్ నిమగ్నమయ్యారు. భీమారం మండలంలో గురువారం అర్ధరాత్రి వరకు ఉండి ఓ వర్గాన్ని ఆయన బుజ్జగించిన విషయం ఆ నోట, ఈ నోట పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి, ఈ మధ్య పార్టీలో చేరిన వారికే వివేక్ ప్రాధాన్యత ఇస్తుండడంతో అన్ని మండలాల్లో క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు అట్టుడుకిపోతున్నారు. ఇది ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రచారం చేయడం కన్నా ఎక్కువ నాయకులను బుబ్జగించడం, కొనుగోళ్లకే సమయం కేటాయిస్తున్నారని వివేక్పై కిందిస్థాయి నాయకులు మండిపడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో టికెట్ ఆశించిన మర్సకోల సరస్వతి రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరారు. మంచిర్యాల టికెట్ విషయంలో చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా, మరోవైపు ఈ టికెట్ల వ్యవహారం, అసమ్మతులు, ఆగ్రహ జ్వాలలు, రెబల్స్ బెడదతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీని కుంగదీస్తున్నది.
ఇక టికెట్లు లభించిన అభ్యర్థులు చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్ పరువును రోడ్డుకిడుస్తున్నారు. ఆదిలాబాద్లో మొన్న రేవంత్రెడ్డి బహిరంగ సభ కోసం డబ్బులు ఇస్తామని చెప్పి జనాలను తీసుకొచ్చి సభ అయ్యాక డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రజలంతా అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్లో నామినేషన్ సందర్భంగా భోజనం పెట్టి, డబ్బులు ఇస్తామని జనాన్ని తీసుకొచ్చిన అభ్యర్థి శ్యాంనాయక్ డబ్బులు ఇవ్వలేదంటూ గురువారం పెద్ద ఎత్తున ఆయన ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఒకవైపు అసమ్మతులు, అసంతృప్తులు రగిలిపోతుంటే మరోవైపు చిల్లర రాజకీయాలు మైనస్గా మారుతున్నాయి.
ఇక చెన్నూర్లో ఓటమి ఖాయమనే భయంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి, నాయకులను కాంగ్రెస్ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం సమీపంలో గురువారం నానా రచ్చ చేశారు. ఈ సమయంలో అక్కడి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను చూసి నినాదాలు చేయడంతో వారు నినాదాలు చేస్తూ తిప్పి కొట్టారు. దీంతో కాసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇలా డబ్బులు పెట్టి నాయకులను కొనుగోలు చేసే రాజకీయాలు, డబ్బులిచ్చి జనాలను తరలించే చిల్లర రాజకీయాలతోపాటు గొడవలు, బెదిరింపులు, కవ్వింపు చర్యలతో రౌడీ రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతుండడం తీవ్రమైన విమర్శలకు దారితీస్తున్నది.