సోన్, డిసెంబర్ 30 : ఆరోగ్య అవసరాలు తీర్చడంలో కూరగాయల పాత్ర కీలకంగా మారింది. ప్రతి ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి కూరగాయల వినియోగం తప్పనిరిసరిగా మారింది. దీంతో మార్కెట్లో కూరగాయలకు భలే డిమాండ్ ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో నిర్మల్ మండలంలోని వ్యవసాయ భూముల్లో కొందరు రైతులు వ్యవసాయంతో పాటు కూరగాయల నర్సరీలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. నిర్మల్ మండలంలోని మంజులాపూర్, తల్వేద, చిట్యాల్, మేడిపెల్లి, కొండాపూర్ గ్రామాల వద్ద కూరగాయల నర్సరీలను నిర్వహిస్తూ ఏడాదంతా ఆదాయాన్ని పొందుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వంకాయ, టమాట, దోసకాయ, మిరప, పువ్వుగోబీ, ఆకుగోబీ తదితర విత్తనాలను విత్తి నార్లను పెంచుతున్నారు. వ్యవసాయ భూముల్లో 20 గుంటల భూమిని కేటాయించి చలువ పందిళ్లను వేసి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో కూరగాయల పంటల నార్లను పెంచుతున్నారు.
మొక్క విత్తేందుకు ప్లాస్టిక్తో తయారు చేసిన ప్లేట్ ఆకారంలో ఉన్న వాటిలో ఒక్కొక్క దానిపై 20 మొక్కలు పెరిగేలా చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొబ్బరిపీచుతో కూడిన మట్టిని తయారు చేసి ఆవుపేడతో ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క నర్సరీలో వివిధ రకాలకు సంబంధించినవి 2వేల వరకు పెంచే అవకాశం ఉండడంతో రైతులు కూరగాయల సాగుతో పాటు పూలమొక్కలు, ఇతర మొక్కలు పెంచుతున్నారు. ఒక్కొక్క కూరగాయ మొక్కకు రూ.1 చొప్పున, పూలమొక్కకు రూ.5 నుంచి రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేసే రైతులు నారు పోసుకొని దాన్ని పంట చేనులో విత్తుకోవడానికి నారు ఎదిగే వరకు వేచి చూడడంతో పాటు పెట్టుబడులు సైతం అధికమవుతాయి. దీంతో రెడిమేడ్గా దొరుకుతున్న కూరగాయల నారును కొనుగోలు చేసి పంటలు పండిస్తున్నారు. గ్రామాల్లో ఖాళీ పెరట్లలో కూరగాయలను సాగు చేసి ఆహార అవసరాలను తీర్చుకుంటున్నారు. పట్టణాల్లో కూరగాయలకు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో కొందరు సిమెంట్ కుండీల్లో నారును పెంచి కూరగాయలు పండిస్తున్నారు. మార్కెట్లో రూపాయికే కూరగాయ నారు లభించడంతో అటు రైతుకు, ఇటు నారు పెంచే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక్కొక్క నర్సరీలో రోజుకు 500 నుంచి వెయ్యి మొక్కలు విక్రయిస్తున్నట్లు కూరగాయల నర్సరీ నిర్వాహకులు పేర్కొంటున్నారు.