తొలిరోజు బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బులు
ఫోన్లకు మెస్సేజ్లు.. ఏటీఎంల వద్ద బారులు..
పెట్టుబడి సాయం చూసి మురిసిపోతున్న అన్నదాతలు
విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్న కర్షకులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
అసలు సిసలు ‘రైతుబంధు’వు సీఎం కేసీఆర్. రైతన్నకు ఏం కావాల్నో అదే చేస్తున్నడు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి పుష్కలమైన నీరు నిల్వ ఉండేటట్లు చేసిండు. రైతన్నలు రాత్రిపూట ఇబ్బంది పడొద్దని 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నడు. సబ్సిడీపై వాహనాలు ఇస్తున్నడు. నాటి బాధలు చూసి రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నడు. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది విడుతలుగా సాయం అందించగా, మంగళవారం తొమ్మిదో విడుత కింద డబ్బులు జమ చేశారు. వానకాలం, యాసంగికి సంబంధించి ఒక్కో సీజన్కు రూ.5 వేల చొప్పున యేడాదికి రూ.10 వేలు ఇస్తున్నరు. తొలిరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,74,693 మంది రైతులకు రూ.80.15 కోట్లు జమయ్యాయి. కాగా, సంబురాలు అంబరాన్నంటగా, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, జూన్ 28 : తెలంగాణ సర్కారు అన్నదాతలకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. వానకాలం, యాసంగికి సంబంధించి ఒక్కో సీజన్కు రూ.5 వేల చొప్పున యేడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటివరకు ఎనిమిది విడుతలుగా అందించగా.. మంగళవారం తొమ్మిదో విడుత కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఎకరం భూమి ఉన్న రైతులకు డబ్బులు వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3,46,518 మంది రైతులకు రూ.704.69 కోట్లు పంపిణీ చేయనున్నది. నిర్మల్ జిల్లాలో 1.83 లక్షల మంది రైతులకు రూ.226 కోట్లు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలిరోజు 85,953 మందికి రూ.46.59 కోట్లు జమ చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలో 1,48,818 మంది రైతులకు రూ.277.26 కోట్లు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 11,333 మంది రైతులకు రూ.4.07 కోట్లు జమ చేసింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 1,52,440 మంది పట్టా పాసుపుస్తకాల రైతులుండగా వీరికి రూ.170.67 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన 82,013 మందికి రూ.40.96 కోట్లు ప్రభుత్వం ట్రెజరీలో జమ చేసింది. తొలిరోజు 45,407 మంది రైతుల ఖాతాల్లో రూ.13.49 కోట్లు జమయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి రోజు 32,000 మంది రైతులకు రూ.16 కోట్లు జమ చేశారు. గతేడాది యాసంగిలో వరి సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. మరోసారి రైతుబంధు సాయాన్ని కూడా అందించనుండగా అవసరమైన సమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలుస్తుండడంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం మాట నిలబెట్టుకున్నడు..
నా పేరు మహేందర్. మాది నిర్మల్ జిల్లా కుంటాల మండలం. నాకు ఎకరం భూమి ఉంది. 2018 సంవత్సరం నుంచి రైతుబంధు కింద పెట్టుబడి సాయం సర్కారు అందిస్తున్నది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలుగా అందించారు. మంగళవారం తొమ్మిదో విడుత కింద రూ.5వేలు వచ్చినయ్. కేంద్రంలోని మోదీ సర్కారు ఎన్ని తిప్పలు పెట్టినా సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచిండు. అన్నదాతల శ్రేయస్సు కోసం పెట్టుబడి సాయం కింద డబ్బులు మా ఖాతాలో జమ చేసిండు.
రూ.ఐదు వేలు జమ అయ్యాయి..
నా పేరు పిండి శ్రీనివాస్. మాది నిర్మల్ మండలంలోని కౌట్ల. మాకు ఊరి శివారు లో ఎకరం భూమి ఉంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు రైతుబంధు కింద రూ.38 వేలు వచ్చాయి. ఈ సారి తొమ్మిదో విడుత కింద రూ.5వేలు నా ఖాతాలో జమ అయినట్లు ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకున్నా. అటు నుంచి అటే దుకాణానికి వెళ్లి ఎరువులు కొనుగోలు చేశా. సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన డబ్బులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి ఉపయోగప డుతున్నాయి. సీఎం సారును మరువం.