ఖాతాల్లో జమవుతున్న రైతుబంధు డబ్బులు
మూడో రోజూ కొనసాగిన చెల్లింపులు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మూడు రోజుల్లో..
లబ్ధిపొందిన రైతులు – 6,95,874
జమైన డబ్బులు – రూ. 484.45 కోట్లు
నిర్మల్ టౌన్/తాంసి, జూన్ 30 : తెలంగాణ ప్రభుత్వం వానకాలం పంటకు సంబంధించి రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో పల్లెల్లో పైసల పండుగ వాతావరణం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొలి రోజు 1,74,693 మంది రైతుల ఖాతాల్లో రూ.80.15 కోట్లు, రెండో రోజూ 2,64,978 మందికి రూ.176.54 కోట్లు జమ అయ్యాయి. మూడో రోజైన గురువారం నిర్మల్ జిల్లాలో 1,41,098 మందికి రూ.124.70 కోట్లు, ఆదిలాబాద్లో 71,628 మందికి రూ.68.12 కోట్లు, మంచిర్యాలలో 23,300 మందికి రూ.28.04 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 20,177 మందికి రూ.25.54 కోట్లు జమ అయ్యాయి. కాగా.. ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే రేఖానాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
‘కొత్త’లు వచ్చినయ్..
నేను మా గ్రామంలో రెండేండ్ల క్రితం మూడెకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశా. మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్త పాసుపుస్తకం తీసుకున్నా. రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నా. ఎకరానికి రూ.5వేల చొప్పున మూడెకరాలకు రూ.15వేలు జమైనట్లు నా ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. భూమి కొనుగోలు చేసి రెండేండ్లయినా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో పెట్టుబడికి ఇబ్బంది పడ్డా. ఇప్పుడు రైతుబంధు కింద సీఎం కేసీఆర్ సాయం అందించినందుకు సంతోషంగా ఉంది. – శివకుమార్, రైతు, వడ్తాల్, ముథోల్ మండలం.