మంచిర్యాల, జనవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను గోస పెడుతున్నది. రైతుబంధు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపుతున్నది. ఇప్పుడేమో ధాన్యం కొనుగోళ్లు ముగిసి పది రోజులు గడిచినా.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం లేదు. సాగు చేసేందుకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు సరే.. ఆరుగాలం కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం డబ్బులను కూడా ఖాతాల్లో వేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు పంట కాలం వచ్చిందంటే చాలు దుక్కి దున్నుకునే టైమ్కు రైతుబంధు ఇచ్చింది. ఇప్పుడేమో పంటలు వేసి నెల గడుస్తున్నా ఎకరం పొలం ఉన్న రైతుకు కూడా పెట్టుబడి సా యం అందించలేని దుస్థితి. అప్పుడేమో 24 గంటల కరెం ట్ ఉంటే ఇప్పుడేమో 18 గంటల కరెంట్.. అప్పుడేమో ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడితే ఇప్పుడెమో వారం, పది రోజులు అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కాంగ్రెసోళ్లు తీసుకొస్తామని చెప్పిన మార్పు ఇదేనా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వరి ధాన్యం అధికంగా సాగు చేస్తారు. ఈ రెండు జిల్లాల్లో రైతులకు ధాన్యం డబ్బులు జమ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. నిర్మ ల్ జిల్లాలో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు గడిచిన నా లుగైదు రోజుల్లో క్లియర్ చేశారు. మంచిర్యాల జిల్లా రైతులకు మాత్రం పది రోజులు అవుతున్నా కొందరికీ డబ్బులు రాలేదు. మంచిర్యాల జిల్లాలోనే 7,023 మందికి రూ. 102.98 కోట్లు, నిర్మల్లో 1,146 మందికి రూ.12.77 కోట్లు, ఆదిలాబాద్లో 106 మందికి రూ.46.88 లక్షలు, ఆసిఫాబాద్లో రూ.7.5 కోట్లు చెల్లించాలి.
ఉట్నూర్ రూరల్, జనవరి 17 : వర్షాకాలంలో ఎనిమిదెకరాల్లో వరి వేశా. మా గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో 25 రోజుల క్రితం 161 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. అధికారులేమో అమ్మిన వారం లోపు వస్తాయని చెప్పారు. రెండు రోజులకోసారి బ్యాంకుకు వెళ్లి చూసుకుంటున్నా. డబ్బులు ఇప్పటివరకు కూడా జమ కాలేదు. కూలీలు, వరి కోత యంత్రం యజమానికి, మందుల దుకాణంలో పైసలు కట్టేది ఉంది. సానా ఇబ్బంది అయితండి. కేసీఆర్ సార్ ఉన్నపుడు ఇట్ల లేకుండే. అమ్మిన 24 గంటల్లో డబ్బులు వస్తుండే. వడ్ల డబ్బులు త్వరగా తమ ఖాతాలో వేయాలని కోరుతున్నారు.
– భక్తు స్వామి, రైతు, గంగన్నపేట్, ఉట్నూర్ మండలం.