రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అవి ‘వేదిక’లు అవుతున్నాయి… సాగు పనులు మొదలై, పంటలు చేతికచ్చే దాకా చైతన్య దీపికలవుతున్నాయి.. లాభసాటి దిగుబడిపై వ్యవసాయ అధికారులు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు తరగతి గదుల్లా మారుతున్నాయి. ఎరువు లు, విత్తనాలు, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడుతు న్నాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రైతు వేదికలు సాగును సంబురంలా మార్చాయి. రైతన్న కుటుంబాల్లో సంతోషాన్ని నింపాయి.
నిర్మల్, జూలై 10(నమస్తే తెలంగాణ): రైతులకు ఉపయోపగడేలా నిర్మించిన రైతు వేదికలు సాగుకు అవగాహన నిలయాలుగా మారాయి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించి, అన్ని సౌకర్యాలతో నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా ఈ వానకాలం సీజన్కు సంబంధించి వర్షాలు కాస్త ఆలస్యంగా కురవడంతో వరి నాట్లు 15 రోజులు పాటు ఆలస్యం కానున్నాయి. మిగతా అన్ని పంటల సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రైతులకు లాభసాటి పంటల సాగుపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలోని 79 క్లస్టర్ల పరిధిలో 79 రైతు వేదికలున్నాయి. ఆయా వేదికల ద్వారా రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు. ఈ వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 3,90,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు 2,20,000 ఎకరాల్లో సాగు పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏవోలు, ఏఈవోలు అన్ని వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాలు రైతులతో వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
రైతు వేదికల్లో సమావేశాలు
ఈ వానకాలం సీజన్లో రైతులు లాభసాటి పంటలు సాగు చేసి లబ్ధిపొందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి రైతు వేదికలో వారానికి రెండుసార్లు రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం వ్యవసాయాధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పంటల సాగులో మెళకువలను తెలియజేయడంతో పాటు పచ్చిరొట్ట వాడకంతో భూసారం పెరుగుతుందని సూచిస్తున్నారు. భాస్వరాన్ని కరిగించే జీవ ఎరువుల వాడకం గురించి రైతులకు పూర్తిగా వివరిస్తున్నారు.
వరిసాగులో దమ్ము లేకుండా నేరుగా విత్తుకునే వెదజల్లే పద్ధతి, ఎరువులను ఒకేసారి కాకుండా దఫాదఫాలుగా వేయడంపై విలువైన సూచనలను అందిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది పంటలను ఎక్కువగా సాగు చేయాలని చెబుతున్నారు. వీటితో పాటు ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం పోడు భూముల్లో కూడా ఆయిల్పామ్ సాగుకు అనుమతినివ్వడంతో, వారికి కూడా ఈ తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సమావేశాల్లో చెబుతున్న అంశాలపై రైతులు అవగాహన పెంపొందించుకొని వాటిని పాటిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
వానకాలం పంటల సాగు కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకున్నది. జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 3.90లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 15వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 6 వేల క్వింటాళ్ల కంది, 4500 క్వింటాళ్ల మక్క, 150 క్వింటాళ్ల పెసర, 150 క్వింటాళ్ల మినుము విత్తనాలను అందుబాటులో ఉంచారు. కాగా, ఇప్పటికే 28 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు కోసం 210 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచారు. వీటిలో ఇప్పటికే 150 క్వింటాళ్ల వరకు పంపిణీ చేశారు.
మరో 60 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆయా పంటల సాగుకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ఇప్పటికే 21వేల మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేశారు. మరో 9200 మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్గా ఉంచారు. డీఏపీ 9వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేసిన వ్యవసాయాధికారులు, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 7400 మెట్రిక్ టన్నుల డీఏపీని రైతులకు పంపిణీ చేశారు. మరో 2350 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉంది. వీటితో పాటు కాంప్లెక్స్, పొటాష్ ఎరువులు అవసరమైన మేరకు రైతులకు అందుబాటులో ఉంచారు.
లాభసాటి పంటలపై అవగాహన
నిర్మల్ జిల్లాలోని 79 రైతు వేదికల్లో వారానికి రెండుసార్లు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాల్లో మండల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు లాభసాటి పంటల సాగు, ఎరువుల వాడకం, సాగులో మెళకువలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే స్థానిక వ్యవసాయాధికారులు ఆసక్తి కలిగిన రైతులను ఎంపిక చేసి క్షేత్రస్థాయి ప్రదర్శనలకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుత వానకాలం సీజన్లో ఎక్కువగా పత్తి, కంది, ఇతర వాణిజ్య పంటలతో పాటు ఆయిల్పామ్ను అధికంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఆయిల్ పామ్ సాగుతో నాలుగేళ్ల నుంచి ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చు. అంతే కాకుండా ఈ నాలుగేళ్లలో అన్ని రకాల అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిర్మల్