ముథోల్, ఏప్రిల్ 10 : ఒకప్పడు వ్యవసాయం అంటే దండగా అనే నిరాశలో కూరుకు పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. సీఎంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఒక పండగలా మారింది. ఒకవైపు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు అనేక పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నది. దీంతో రైతుల కళ్లల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. దీంతో పాటు రైతు ప్రమాదవశాత్తు, లేదా ఇతర సంఘటనల ద్వారా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రైతు బీమాతో అండగా నిలుస్తున్నది.
ఆ కుటుంబానికి ప్రభు త్వం పెద్ద దిక్కుగా ఉంటున్నది. దీంతో రైతులు తమకున్న బాధలు మరిచి సంతోషంగా జీవించే పరిస్థితి తీసుకు వచ్చింది. లబ్ధి పొందిన రైతులు తమ పనులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రైతు బీమాతో ఇబ్బందులు లేకుండా ఉంటున్నామని పేర్కొంటున్నారు.
181 కుటుంబాలకు పరిహారం
ముథోల్తో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వివిధ కారణాలతో మరణించారు. వారి ఇంటి వద్దకు వ్యవసాయ అధికారులు వెళ్లి నామినీ వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాలకు రూ. 9.5 కోట్లు బీమా రూపంలో అందించారు. రైతులు బీమాకు సంబంధించిన డబ్బులు సైతం ప్రభుత్వమే భరిస్తున్నది. రైతులకు కష్టం కలుకగనీయకుండా, డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుం డా నామినీ పేరుపై ఉన్న ఖాతాలోనే పరిహారాన్ని జమచేస్తూ అండగా నిలుస్తున్నది. 2018 లో 38 మంది, 2019 లో 33 మంది, 2020 లో 45, 2021 లో 47మంది , 2022 లో 18 మంది మృతి చెందినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మొత్తం 181 మందికి బీమా పరిహారాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లోనే జమచేసింది.
కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంది
తెలంగాణ ప్రభుత్వం మా కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకుంది. నా భర్త చనిపోవడంతో బాధలో ఉన్నాం. ఎవరూ లేరని అధైర్య పడుతున్న సమయంలో ప్రభుత్వం రైతు బీమా పరిహారం అందించింది. అధికారులే మా ఇంటికి వచ్చి వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో అప్పులు తీర్చుకున్నాం. ప్రస్తుతం ఇబ్బంది లేకుండా జీవిస్తున్నాం. ప్రభుత్వం చేసిన మేలును ఎన్నటికీ మర్చిపోలేం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– సవిత,ముథోల్