రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతు బీమా’ పథకం నేపథ్యంలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. దీంతో ఏదైనా కారణంతో రైతు మృతి చెందితే, రూ.5లక్షల చొప్పున అందే పరిహారంతో బాధిత కుటుంబాలకు భరోసా దక్కుతున్నది. ఈ క్రమంలో భూముల పట్టాల మార్పిడి విపరీతంగా పెరిగింది. వ్యవసాయ భూములను కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట బహుమతిగా రాసిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో రెండేళ్లలోనే 12,500కు పైగా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు జరగడం ఇందుకు అద్దం పడుతున్నది.
నిర్మల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న ఐదెకరాల భూమిని నలుగురు పిల్లలకు సమానంగా రిజిస్ట్రేషన్ చేశాడు.
ముథోల్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ఎకరం భూమి ఉండగా.. ఇద్దరు కుటుంబ సభ్యులకు చెరో అరెకరం చొప్పున గిఫ్ట్ డీడ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు.
ధరణి అందుబాటులోకి వచ్చిన రెండేండ్లలో 19 మండలాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో వివిధ రకాల రిజిస్ట్రేషన్లు 31,577జరుగగా.. అందులో సింహభాగం గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లే కావడం గమనార్హం.
నిర్మల్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : రైతు బంధు పథకానికి నిబంధనలు ఏమీ లేవు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉండి కనీసం గుంట భూమితో పాస్పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకూ తెలంగాణ ప్రభుత్వం బీమాను వర్తింపజేస్తున్నది. ఏదైనా కారణంతో రైతు చనిపోతే పది రోజుల్లోనే ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వం రూ.5లక్షలను బాధిత కుటుంబానికి అందిస్తున్నది. అలాగే రైతు బంధు సాయం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. వీటితోపాటు ఇతర ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందాలన్నా.. తమ పేరిట భూమి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతులు తమకున్న వ్యవసాయ భూముల్లో కొంత తమ పిల్లలు, కుటుంబ సభ్యుల పేరిట గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాలో గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకరి నుంచి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే భూమి విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. ఉదాహరణకు ఎకరం భూమి విలువ రూ.2.50లక్షలు ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ కింద రూ22వేల వరకు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అదే బహుమానం పేరిట కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయిస్తే రూ.5వేల నుంచి రూ.15వేల వరకు మాత్రమే ఖర్చవుతుంది. రిజిస్ట్రేషన్ ఖర్చుల్లో తగ్గుదలతోపాటు బీమా ప్రయోజనం ఉండడంతో ఎక్కువగా రైతులు గిఫ్ట్డీడ్ రిజిస్ట్రేషన్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. బీమా పథకం ప్రారంభమైన 2018 సంవత్సరం నుంచే జిల్లా వ్యాప్తంగా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. ధరణి వచ్చాక కూడా అదే ఊపు కనిపిస్తున్నది. 19 మండలాల్లోని తాసీల్దార్ కార్యాలయాల్లో గడచిన రెండేండ్లలో 31,577 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే ఇందులో 12,500 గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లే కావడం విశేషం.
1,11,972 మంది రైతులకు లబ్ధి…
రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 14న రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు. భారతీయ జీవిత బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమాను వర్తింపజేస్తున్నది. ఆరంభంలో ఒక్కో రైతుకు రూ.2,271 చొప్పున చెల్లించిన ప్రీమియాన్ని గతేడాది నుంచి రూ.3,457కు పెంచింది. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 1,83,499 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరయ్యాయి. గతేడాది వరకే 1,02,289 మంది రైతులు బీమా పథకం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇంకా జిల్లాలో 9,683 మంది బీమా పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులుగా తేల్చారు. ఈ ఏడాది ప్రభుత్వం బీమా నమోదుకు అవకాశం కల్పించడంతో ఇప్పటివరకు 6,787 మంది ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు ఈనెల 13తో ముగియనుంది. అప్పటి వరకు మిగతా అందరినీ ఈ పథకంలో నమోదు చేయించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1,11,972 మంది రైతు బీమాకు అర్హత పొందనున్నారు.
2,311 కుటుంబాలకు బీమా సాయం…
‘రైతు బీమా’ పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తున్నది. వివిధ కారణాలతో మృతిచెందిన రైతుల పేరిట రూ.5లక్షల చొప్పున అందిస్తున్న పరిహారం ఆయా కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపుతున్నది. రైతు బీమా ప్రారంభమైన 2018 నుంచి మూడేండ్లలో జిల్లాలో 2,031 కుటుంబాలు లబ్ధిపొందాయి. ఆయా కుటుంబాలకు రూ.101.55కోట్ల బీమా సాయం అందింది. ఈ సంవత్సరంలో 280 మంది రైతులు వివిధ కారాణాలతో మృతి చెందగా నామినీల ఖతాల్లో వారం రోజుల్లోనే రూ.5లక్షల చొప్పున జమయ్యాయి. ఈ లెక్కన రూ.14కోట్ల బీమా సొమ్ము బాధిత కుటుంబాలకు అందింది.