రైతు సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అన్నదాతకు పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఇప్పటివరకు తొమ్మిది విడుతలుగా సాయం అందగా.. పదో విడుత కింద డిసెంబర్ 28 నుంచి డబ్బులు రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నది. విడుతలవారీగా ఎకరాకు రూ.5 వేల చొప్పున అకౌంట్లో పడుతున్నాయి. సర్కారు అందిస్తున్న సాయంతో రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. రైతుబంధు పథకంలో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 4,29,363 మంది రైతులకు రూ.390.53 కోట్ల సాయాన్ని పంపిణీ చేసింది. సర్కారు సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని అన్నదా తలు పేర్కొంటున్నారు. సంక్రాంతికి ముందే డబ్బులు రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ)
రంది లేకుంటయ్యింది..
దహెగాం, జనవరి 5: ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధుతో పెట్టుబడికి రంది లేకుంటయ్యింది. నాకు దహెగాంలో ఆరెకరాల ఎవుసం భూమి ఉంది. ఈ సీజన్కు పెట్టుబడి సాయం కింద రూ. 30 వేలు నా ఖాతాలో పడ్డయ్. ఇయ్యాల్నే డబ్బులను బ్యాంకు నుంచి తెచ్చుకున్న. ఎరువులకు, కూలీల ఖర్సులకు ఈ పైసలు మస్తు ఉపయోగ పడుతయ్. గతంలో కాలం వచ్చిందంటే పెట్టుబడి పైసలకు చానా ఇబ్బంద య్యేటిది. ఈడ, ఆడ తిరిగి అప్పు పట్టుకొచ్చేది. ఒక్కోసారి వడ్డీ ఎక్కువైనా తప్పేది కాదు. ఇప్పుడు పంటలు కూడా మంచిగ పండుతు న్నయ్. కరెంట్, నీళ్లు ఫుల్లుగా ఉంటు న్నయ్. అందుకే నాకున్న భూమికి తోడు మరో ఐదెకరాలు కౌలుకు పట్టిన. పత్తి సాగు చేస్తున్న. సర్కారు ఇచ్చిన ఈ పైసలతోనే నా కుటుంబం, నేను గర్వంగా బతుకుతున్నం.
– పాలె ఊషన్న, దహెగాం
ఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండగా.. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు పథకాలతో వ్యవసాయం పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల పంపిణీ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, పంట కొనుగోళ్ల లాంటి పథకాలు రైతులకు వరంగా మారాయి. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయించేవారు. వ్యాపారులు అధిక ధరలకు అప్పుపై విత్తనాలు, ఎరువులు ఇచ్చేవారు. సాగుకు పైసలు లేక రైతులు సరైన సమయంలో విత్తనాలు వేసేవారు కాదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యకు పరిష్కారం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు రెండు పంటలు వేసుకునేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. గుంట భూమి ఉన్నా రైతు మొదలుకొని ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు యేడాదికి రూ.10 వేల పంట పెట్టుబడి సాయాన్ని అన్నదాతకు అందిస్తున్నడు. దీంతో రైతులు తమకు ఇష్టమైన విత్తనాలు కొనుగోలు చేసి, సకాలంలో పంటలు వేసుకుంటూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
రూ.రూ.390.53 కోట్లు పంపిణీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పదో విడుత రైతుబంధు పంపిణీ డిసెంబరు 28 నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,29,363 మంది రైతులకు రూ. రూ.390.53 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 95,049 మంది రైతులకు ప్రభుత్వం రూ.108.52 కోట్లు, నిర్మల్లో 1,39,027 మందికి రూ.119.68 కోట్లు, మంచిర్యాలలో 1,17,015 మందికి రూ.88 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 78,272 మందికి రూ.74.33 కోట్లను సర్కారు రైతన్నల ఖాతల్లో జమ చేసింది. సర్కారు అందిస్తున్న సాయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయాన్ని మరువలేమని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రధాని కావాలని, అయితే దేశంలోని రైతులకు ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
ఎవుసం బాగా సౌలతయ్యింది
బెజ్జూర్, జనవరి 5: నా పేరు గుర్నులే పోశయ్య. నాది కుశ్నపల్లి. నాకు 3.5 ఎకరాల భూమి ఉన్నది. యాసంగి రైతుబంధు పైసలు నిన్ననే బ్యాంకులో పడ్డయ్. వాటితో యాసంగి ఎవుసం పనులు మొదలువెట్టిన. నా చిన్నతనం నుంచి ఎవుసం చేస్తున్న. ఇదివరకు ఎవుసం చేయాలంటే బాగా కష్టాలుండేవి. కేసీఆర్ సారు రైతుబంధు పథకం పెట్టి పెట్టుబడి సాయం చేస్తుండు కాబట్టే ఎవుసం దారులకు లాభమైతున్నది. మునుపు శావుకార్ల దగ్గరికి పోయి వడ్డీకి పైసలు తెచ్చి ఎవుసం చేయాల్సి వచ్చేది. పండిన పంటలో ఎక్కువ పైసలు శావుకార్లకే పోయేది. కానీ గిప్పుడు పంట ఫలితం మొత్తం రైతుకే దక్కేటట్టు కేసీఆర్ సారు చేసిండు. గిట్ల రైతులను సంతోష పెడుతున్నడు. సీఎం సారు సల్లంగ ఉంటనే మాకు మంచి జరుగుతది. – గుర్నులే పోశయ్య, రైతు, కుశ్నపల్లి
పైసలు వస్తాయనే పంటకు సిద్ధమయ్యా..
సోన్, జనవరి 5 : నాకు మా గ్రామంలో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో సీజన్ వచ్చిందంటే గుండెల్లో గుబులు పుట్టేది. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయ్యాక ఎవుసానికి పెట్టుబడి సాయం అందిస్తున్నడు. డబ్బులు రైతుల ఖాతాల్లో వేసి ఆదుకుంటున్నడు. దీంతో ప్రతి గుంటను వదలకుండా పంట పండిస్తున్నాం. ఫలితంగా ఆర్థికంగా ఎదుగుతున్నాం. రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇబ్బందులను దూరం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. యాసంగిలో కూడా భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో పంటలు అధిక విస్తీర్ణంలో వేసుకుంటున్నాం.
– గాండ్ల రవీందర్, రైతు, నీలాయిపేట్, సోన్ మండలం.
రూ.15,500 వచ్చాయి..
సోన్, జనవరి 5 : ఈ యేడు అధికంగా వర్షాలు కురిశాయి. దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. నాకున్న మూడెకరాల భూమి దున్నిన. అప్పు చేసి విత్తనాలు కొన్నా. ఇంకా.. పెట్టుబడికి ఎలా అని ఆలోచిస్తున్నా. ఈ తరుణంలో రైతుబంధు కింద పెట్టుబడికి సర్కారు రూ.15,500 రెండు రోజుల క్రితమే నా ఖాతాలో జమ అయ్యాయి. కూలీలకు, ఎరువులకు ఉపయోగిస్తా. ఒక వేళ పైసలు రాకపోతే ప్రైవేట్ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఆ బాధలు తప్పాయి.
– సముందర్పెల్లి ప్రదీప్, రైతు, సోన్ మండలం.
పది ఎకరాల్లో పంటలు
దహెగాం, జనవరి 5: మాది ఐనం గ్రామం. నాకు పదెకరాల భూమి ఉన్నది. రైతు బంధు సాయం కింద నాకు ఒక్కో సీజన్కు రూ. 50 వేలు వస్తున్నయ్. ఈసారి కూడా వచ్చినయ్. పది ఎకరాల్లో పత్తి పంటనే వేసిన. పెట్టుబడికే ఈ పైసలు వినియోగి స్తున్న. విత్తనాలు, ఎరువులు కొంటున్న. ఈ సంవత్సరం పదెకరాల్లో ఇప్పటి వరకు 80 క్వింటాళ్ల పత్తి ఏరిండు. మరో 50 క్వింటాళ్లు ఏరాల్సి ఉంది. ఏటా దాదాపుగా 130 క్వింటాళ్ల పత్తి పండిస్తున్న. సగటున ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు సంపాదిస్తున్న. సర్కారు ఇస్తున్న పైసలతోటే ఇదంతా సంపాదించగలు గుతున్న. సీఎం కేసీఆర్ సారు చేస్తున్న ఈసాయం మరువం.
-బోర్కుట్ వినోద్, ఐనం
రైతులకు ఇన్ని పథకాలు ఎక్కడా లేవు..
రైతుల కోసం తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు, పంట కొనుగోళ్ల లాంటివి రైతులకు వరంగా మారాయి. మాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో చూస్తే మన దగ్గర అమలవుతున్న పథకాలు ఏ ఒక్కటి అక్కడ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దన్నగా ఉంటూ ఎన్నో పథకాలు అమలు చేస్తూ మా కష్టాలు దూరం చేశారు. రైతుబంధు పథకం రాక ముందు పంట పెట్టుబడి కోసం బ్యాంకులు, దుకాణాదారులు చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు సీజన్లలో సర్కారు మాకు ఎకరాకు రూ.5 వేల చొప్పున యేడాదికి రూ.10వేలు ఇస్తున్నది. దీంతో సీజన్కు ముందుగానే విత్తనాలు, మందు బస్తాలు కొనుగోలు చేసి సకాలంలో పంటలు వేస్తున్నాం.
– జగడం పెంటన్న, రైతు, అంకోలి
ఆదిలాబాద్ రూరల్ మండలం 20 వేలు వచ్చినయ్..
బెజ్జూర్, జనవరి 5: కుశ్నపల్లి శివారుల నాకు నాలుగెకరాల భూమి పట్టా ఉన్నది. ఈసారి కూడా రైతుబంధు కింద నాకు రూ. 20 వేలు ఖాతాల పడినయ్. గత నాలుగేళ్ల నుంచి పండిన పంట డబ్బులతో కొత్తగా వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకొని లాభాలు పొందుతున్న. తెలంగాణ సర్కారు పుణ్యామని రైతులు పండుగలా ఎవుసం చేసుకుంటున్నరు. గతంలో ఎవుసమంటేనే రంది పడేది. కరంట్, నీళ్లు లేక పంటలు నష్టం పాలయ్యేది. ఇప్పుడా దిగులు లేదు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలే. అందుకే రైతులు ఎవుసం మానుకొని, వేరే పనులకు పోయిన్రు. కేసీఆర్ సారు మంచి ఆలోచన చేసి, రైతులను రాజుల్ల బతుకతమని చెప్పిండు. రైతుబంధు, బీమా లాంటి పథకాలు మాకు ఆ దేవుడిచ్చిన కానుక. ఆయన సల్లంగుంటనే పంటలు మంచిగ పండుతయ్.
-గడ్డం రాజేశ్, కుశ్నపల్లి
రెండు పంటలు పండిస్తున్నా..
సర్కారు రైతుబంధు పథకంలో భాగంగా ప్రతి సీజన్కు ఎకరాకు రూ.5 వేలు ఇస్తుండడంతో రెండు పంటలు పడిస్తున్నా. వానకాలం, యాసంగి కలిపి ఎకరాకు రూ.10 వేలు వస్తున్నాయి. నాకు ఐదెకరాల భూమి ఉండగా.. వానకాలం పత్తి, సోయా.. యాసంగిలో శనగ, జొన్న వేస్తా.. రైతుబంధు పైసలు వస్తాయనే నమ్మకంతో దుకాణంలో విత్తనాలు, మందు బస్తాలు ఉద్దెర ఇస్తున్నారు. ఇంతకు ముందు ఏ సర్కారు ఇలాంటి సాయం చేయలేదు. రైతుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ఆలోచించే నాయకులు ఎవరూ లేదు. తెలంగాణ సర్కారుకు రైతుల అండ ఎప్పటికీ ఉంటుంది.
– నగేశ్, రైతు, జవహర్నగర్, గుడిహత్నూర్ మండలం
ఎవుసం పై ఆసక్తి పెరిగింది
బెజ్జూర్, జనవరి 5: నాకు గతంలో భూమి లేదు. ఎవుసంలో లాభం లేదని అందరూ అంటుంటే ఎవుసం వైపు సూడలే. గత ఐదేళ్ల నుంచి అందరూ సంతోషంగా చెబుతున్నరు. ఎవుసమే సాయితిత్తదని. అప్పట్ల నెర్రెలు వారిన భూములన్నీ సీఎం సారు తెచ్చిన రైతుబంధు పథకంతో పచ్చని పైర్లుగా కనిపిస్తున్నయ్. పథకంతో నాకు పొలం చెయ్యాలనే కోరిక కలిగింది. నా అత్తగారి ఊరు కుశ్నపల్లి కి వచ్చి 2 ఎకరాల భూమి కొనుకున్న. నా పేరట, నాభార్య పేరట చెరో ఎకరం భూమిని పట్టా చేసుకున్నాం. మా కొస్తున్న రైతు బంధు సాయంతో మంచిగ రెండు పంటలు తీస్తున్నం. ఎవుసం మంచిగున్నది కాబట్టే కుశ్నపల్లిలో స్లాబ్ ఇల్లు కట్టిన. ఇంతకన్న మంచి ఏముంటది. గిదంతా కేసీఆర్ దయనే. ఆయన చెయ్యవట్టే రైతులకు మంచి జరుగుతున్నది.
-కొట్రంగి గణపతి, రైతు ఎల్కపల్లి