ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువ జాము నుంచి కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. మృగశిర కార్తె ప్రవేశించి పక్షం రోజులు గడిచినా వాన జాడలేక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. వర్షాలు పడుతుండడంతో పొలంబాట పడుతున్నారు.
నాగళ్లు సిద్ధం చేసుకోవడం, దుక్కులు దున్నడం, కూరెల సాయంతో సాళ్లు కొట్టడం, పత్తి కొయ్యలు ఏరి వేయడం.. పెంట, గొర్రె, పశువుల ఎరువులు చల్లుతున్నారు. విత్తనాలను నాటే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఒకే సమయంలో అందరి చేలలో విత్తనాలు పెట్టే పనుల మూలంగా కూలీల కొరత ఏర్పడుతున్నది. అదే సమయంలో చేతినిండా పనులు దొరకడంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం సాగుకు ప్రభుత్వం సరైన సమయంలో రైతుబంధు పథకం కింద పెట్టు బడి డబ్బులు జమ చేయనుండడంతో.. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణాల వద్దకు వెళ్లడానికి అన్నదాతలు సిద్ధం అవుతున్నారు.
రుతు పవనాల రాక కొంత ఆలస్యమైనప్పటికీ శుక్రవారం వేకువజాము నుంచి తొలకరి జల్లులు పడుతుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు వేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. ఎక్కడ చూసినా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. వరి రైతులు ముందుగా జీలుగ విత్తనాలు వేయడం లాంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టి పంపిణీ చేయడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
– నమస్తే బృందం