Mancherial | మంచిర్యాల అర్బన్, మే 11: మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉపయోగించే బ్రీతింగ్ ఎనలైజర్ (Breathalyzer) మిషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంచిర్యాల డిపోలో బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదని, మద్యం సేవించకపోయినా ‘పాజిటివ్’ అని చూపిస్తున్నాయని రెండురోజుల్లో ఇద్దరు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాజిటివ్ రావడంతో డ్రైవర్లు కుటుంబ సభ్యులతో కలిసి డిపో ముందు సోమవారం ఉదయం నిరసనకు దిగారు.
ఎనలైజర్ మిషన్లలో సాంకేతిక లోపాల వల్ల మద్యం సేవించని డ్రైవర్లకు కూడా ‘పాజిటివ్’ వస్తోందని, దీనివల్ల అనవసరమైన సస్పెన్షన్లు, జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. పాతబడిపోయిన, సరిగ్గా పనిచేయని మిషన్లను వెంటనే మార్చాలని, నాణ్యమైన, ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే కొత్త మిషన్లను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Mancherial Rtc1
కాగా అకస్మాత్తుగా ఉదయం 3.30 నిమిషాల నుంచి ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలపడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది ఏమి లేక ప్రైవేట్ వాహనాలు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు వాహనాల వాళ్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు.