నిర్మల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. జనసంచారంతో రహదారులు కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, బస్టాండ్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ ప్రాంతాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిత్యం ఇతర ప్రాంతాల నుంచి వచ్చివెళ్లే వారు రాకపోకలు సాగిస్తుంటారు. సాయంత్రం కూడా పట్టణవాసులతో కళకళలాడుతాయి. జనసంచారం అధికంగా ఉండడం, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో నిర్మల్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలని మంత్రి అల్లోల ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. నిర్మల్ మీదుగా రెండు జాతీయ రహదారులను కలుపుతూ నలుదిశలా లింకు రోడ్లను వేసి, ఓఆర్ఆర్ తరహా రింగురోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. మొదటగా నిర్మల్-ఖానాపూర్ హైవే నుంచి ఎల్లపెల్లి మీదుగా బంగల్పేట్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.28కోట్లు మంజూరయ్యాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి.
నిర్మల్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా కేంద్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడమే కాకుండా, వాహనాల రాకపోకల తీవ్రతను నిలువరించేందుకు హైదరాబాద్లోని ఓఆర్ఆర్ తరహ రింగురోడ్డు ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలోచన మేరకు తాజాగా ఈ రింగు రోడ్డు ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ఇందులో భాగంగానే నిర్మల్ చుట్టూ ఓఆర్ఆర్ తరహాలో విశాలమైన రోడ్లను నిర్మించతలపెట్టారు. దీని కోసం ముందుగా జాతీయ రహదారి నంబర్ 61 నుంచి ఎల్లపెల్లి, నూతన కలెక్టరేట్ మీదుగా బంగల్పేట్ వరకు దాదాపు మూడున్నర కిలో మీటర్ల పొడవుతో రింగు రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోడ్డు నిర్మాణం తో పాటు అవసరమైన భూ సేకరణ కోసం రూ. 28కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.ఈ రోడ్డు పనులను ఇటీవలే మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్వయం గా ప్రారంభించారు. ప్రతి రోజు నిర్మల్ జిల్లా కేంద్రానికి ఖానాపూర్, భైంసా, బోథ్, ఆర్మూర్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ పనుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. నిర్మల్.. జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి రాకపోకలు మరింత పెరిగాయి. పెరిగింది. నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనులతో పాటు వ్యాపార పనుల కోసం వేలాది సంఖ్యలో జనం వస్తుంటారు. వీరంతా నిర్మల్కు చేరుకోవాలన్నా, లేదా నిర్మల్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇప్పటి వరకు పట్టణం నుంచే వెళ్లాల్సి వస్తున్నది. దీంతో నాలుగు వైపుల నుంచి వచ్చే ప్రజలతో మంచిర్యాల చౌరస్తా కిటకిటలాడుతున్నది.
నలుదిక్కుల నుంచి వచ్చీపోయే వాహనాలతో కలెక్టరేట్, బస్టాండ్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ తదితర ప్రాంతాలన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సార్లు ప్రజలు నడిచి వెళ్లేందుకు సైతం తిప్పలు తప్పడం లేదు. గత రెండు మూడేళ్ల నుంచి భారీ జన సంచారంతో నిర్మల్ పట్టణం కిటకిటలాడుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై మంత్రి దృష్టి సారించారు. ఇప్పటికే రెండు మూడు సార్లు జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. నిర్మల్-ఖానాపూర్ హైవే నుంచి ఎల్లపెల్లి మీదుగా బంగల్పేట్ వరకు రోడ్డు నిర్మాణానికి మంత్రి రూ. 28 కోట్లు మంజూరు చేయించారు. బంగల్పేట్ నుంచి విశ్వనాథ్పేట్ వరకు ఆదిలాబాద్ రోడ్డును కలుపుతూ గతంలోనే రోడ్డును వేశారు. ఈ రోడ్డును వెడల్పు చేసి, కొత్తగా వేసే 4 లేన్ రోడ్డును లింక్ చేస్తే ఆదిలాబాద్ వైపు నుండి నిర్మల్ మీదుగా ఖానాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా మారుతుంది. నిర్మల్ పట్టణంలోకి రాకుండానే నేరుగా 61వ హైవే పైకి చేరుకోవచ్చు. శాంతినగర్ చౌరస్తా నుంచి సోఫీనగర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిని కలుపుతూ ఇప్పటికే రోడ్డు వేశారు. భైంసా, ఆర్మూర్ వైపు నుంచి వచ్చే వారి కోసం, బోథ్ వైపు నుంచి వచ్చే వారికోసం కూడా తాజాగా రింగ్ రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం..
నిర్మల్-ఖానాపూర్ హైవే నుంచి ఎల్లపెల్లి, నూత న కలెక్టరేట్ మీదుగా బంగల్పేట్ వరకు రూ.28 కోట్లతో చేపట్టే 4 లేన్ల రోడ్డు పనులను ప్రారంభిం చాం. వచ్చే మార్చి నాటికి నాలుగు వరుసల రోడ్డుతో పాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు తదితర పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇదే రోడ్డును బంగల్పేట్ నుంచి విశ్వనాథ్పేట్ వరకు పొడగించి ఆదిలాబాద్ హైవేకు కలిపేందుకు అవసరమైన అంచనాలు తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాం.
– శంకరయ్య, ఈఈ, పంచాయతీరాజ్ శాఖ, నిర్మల్