మంచిర్యాల, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో ధాన్యం సేకరణలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. మిల్లర్లు తమ స్వలాభం కోసం కొనుగోళ్లకు సహకరించకపోవడంతో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు. గతేడాది జిల్లాలో 272 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టగా, ఈ మేడాది 286 కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. ఏప్రిల్ 1న జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ సీజన్లో 1.80 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,08,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఐదారు రోజుల్లో ఇంకా 70 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యమయ్యేలా లేదు.
మంచిర్యాల జిల్లాలో 19 పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు. దాదాపు 80వేల మెట్రిక్ టన్నుల నుంచి 90 వేల మెట్రిక్ టన్నుల వరకు ఈ మిల్లులకు తరలించి, మిగిలిన ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లాలోని మిల్లులకు తరలించాలనుకున్నారు. కానీ జిల్లా మిల్లుల లక్ష్యం పూర్తి కాకుండా 45 మిల్లులకు ధాన్యం తరలించేందుకు ట్యాగింగ్ ఇచ్చారు. ఎందుకు అలా చేశారో అర్థంకానీ పరిస్థితుల్లోనే ముందేమో రా రైస్ మిల్లులకు ధాన్యం ఇవ్వమని చెప్పిన అధికారులే, జిల్లాలోని 13 రా రైస్ మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు. ఇక కొనుగోళ్లు వేగవంతం అవుతాయని రైతులు, కేంద్రాల నిర్వాహకులు ఆశపడేలోగానే..
పెద్దపల్లి మిల్లులకు ధాన్యం పంపించవద్దంటూ గురువారం రాత్రి అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో మంచిర్యాల జిల్లాలోని 32 మిల్లులకు ధాన్యం పంపాల్సి వస్తుంది. ఇక్కడ కొస మెరుపు ఏమిటంటే అధికారులు చెప్పినా.. మంచిర్యాల జిల్లాలోని మిల్లర్లు మాత్రం ధాన్యం దించుకోడానికి ఆసక్తి చూపడం లేదు. 40 కిలోలు ఉండాల్సిన బస్తాలో 42 లేదా 43 కిలోలు ఉంటేనే తీసుకుంటామంటూ కొందరు మిల్లుర్లు చెబుతుండడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నోరెళ్ల్లబెడుతున్నారు. ఈ మేరకు బస్తాలు కటింగ్ పెట్టుకుంటామంటేనే అన్లోడ్ చేస్తామని, లేకపోతే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ కొందరు మిల్లర్లు తెగేసి చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు ఉండే వాట్సాప్ గ్రూ ప్లో శుక్రవారం జిల్లా ఉన్నతాధికారి.. మంచిర్యాల జిల్లాలోని శివరామకష్ణ ట్రేడర్స్(మిట్టపల్లి), శ్రీరామచంద్ర పీబీ ఓఆర్(గుల్లకోట), వేంకటేశ్వర పీబీఆర్ఎం(కన్నెపల్లి), ఎస్ఆర్ఎమ్ ఇండస్ట్రీస్, హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ (మంచిర్యాల), జయలక్ష్మి ఇండస్ట్రీస్, వరలక్ష్మి ఇండస్ట్రీస్ (ఇందారం)లకు ధాన్యం పంపాలంటూ మెస్సేజ్ చేశారు. ఈ మిల్లుల ధాన్యం దిగుమతి కోటా ఇంకా పూర్తి కాలేదంటూ స్పష్టంగా అందులో పేర్కొన్నా రు.
అలా అధికారులు చెప్పడంతో భీమారం మండలంలోని ఓ కేంద్రం నిర్వాహకుడు 1050 బస్తాల్లో ఉన్న లారీని ఇందారంలోని జయలక్ష్మి ఇండస్ట్రీస్కు పంపించారు. కానీ మిల్లు య జమాని లారీని మిల్లులోపలి నుంచి బయటికి తీసుకెళ్లాలంటూ డ్రైవర్కు సూచించాడు. అన్లోడింగ్ చేసుకోమని చెప్పాడు. వి షయం తెలుసుకున్న కొనుగోలు కేంద్రం సెంటర్ నిర్వాహకుడు ఫోన్ చేయగా.. ఎవరిని అడిగి లోడ్ పంపించారంటూ సదరు మిల్లర్ ఫైర్ అయ్యాడు.
మా మిల్లుకు రావాల్సిన ధాన్యం కంటే ఎక్కువ ధాన్యం వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో అన్లోడ్ చేయమని చెప్పారు. అధికారులు చెప్పారంటూ కేంద్రం నిర్వాహకు డు ఎంత చెప్పినా మిల్లర్ వినలేదు. నాకు ఎవ్వరూ చెప్పలేద ని.. నేను లోడ్ దింపలేనంటూ తేల్చి చెప్పాడు. వెంటనే సదరు కేంద్రం నిర్వాహకుడు అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లా డు. అధికారులకు ఫోన్ చేసి ఎత్తలేదని, వాట్సాప్ గ్రూప్లో మె స్సేజ్ చేసినా స్పందించ లేదని చెప్పారు.
ఈ ఒక్క రోజు చూసి రైతులను తీసుకెళ్లి మిల్లుముందు ధర్నాకు దిగుతామంటూ సదరు సెంటర్ నిర్వాహకుడు తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం సేకరణ నెలాఖరులోగా పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందంటూ సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో పని చేసే అధికారులే అంటున్నారు. మిల్లర్లు సహకరించకపోతే ధాన్యం సేకరణకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఎలా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సి ఉంది.