ఎదులాపురం, ఏప్రిల్ 27 : రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు కనీస గౌరవం ఇవ్వని మూర్ఖుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గం శేఖర్ అన్నారు. బుధవారం ర్యాలీ సందర్భంగా భారీ గజమాలతో సత్కరించుకున్న రేవంత్ రెడ్డి, కనీసం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకపోవడంపై దళిత సంఘం నాయకులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ గురువారం అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో శుద్ధిచేసి, క్రేన్ సాయంతో భారీ గజమాల వేశారు. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌక్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహానికి కనీస గౌరవం ఇవ్వని రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక బీసీ నేతల పేర్లను సైతం సభలో ప్రస్తావించకపోవడం ఆయన కుల అహంకారానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు. భారీ గజమాలతో సత్కరించుకున్న రేవంత్ రెడ్డి, ఎదుటే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదని, ఆయనకు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధిచెప్తామని స్పష్టం చేశారు.
దేశప్రజలంతా దేవుడిలా పూజించే అంబేద్కర్ను అవమానించే రీతిలో వ్యవహరించిన రేవంత్రెడ్డి, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్లు దుర్వ నగేశ్, బాబాసాహెబ్ కాంబ్లే, నక్క రాందాస్, మైనార్టీ జిల్లా నాయకులు మహమ్మద్ తాయర్, ఫిరోజ్, సలీంపాషా, మత రమాబాయి అంబేద్కర్ మహిళా అధ్యక్షురాలు శోభ తుల్జాపూరే, ప్రధాన కార్యదర్శి బాబిబాయి, కోశాధికారి సులోచన జాబాడే, వివిధ సంఘాల ప్రతినిధులు జన గం సంతోష్, శంకరయ్య, సతీశ్ శర్మ, సభ్యులు అనితబాయి, సంగీత, రమాబాయి, సుమన్బాయి, భారత్బాయి, దళిత, బీసీ, మైనార్టీ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.