కుభీర్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress ) రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ( BRS ) మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ( Ennila Anil ) ఆరోపించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ తహసీల్దార్ శివరాజ్ కు మొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు నెలరోజులు గడిచిపోతున్నప్పటికీ నేటికీ కేంద్రాలు తెరవకపోవడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మక్క రైతులు ప్రైవేట్లో రూ. 1700 క్వింటాలు అమ్ముకొని ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోయా, కందులు, శనగలు రైతుకు చేతికి వచ్చిన సమయంలోనూ ప్రభుత్వం ఇదే నాటకం ఆడిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి 24 గంటలు వ్యవసాయ విద్యుత్, రైతుబంధు, రైతులకు వ్యవసాయ భీమా సౌకర్యం, రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేసిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు పుప్పాల పీరాజీ, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు మొహియుద్దీన్, సాప పోతన్న, పోగుల పోతన్న, పోగుల లింగన్న, దత్తాత్రి, కాశీనాథ్, నాగేష్, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యమ నాయకుడు పీరాజీ జన్మదినం సందర్భంగా ఆయనను బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు.