ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 15 : ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ఆసిఫాబాద్ సమీపంలో నుంచి బైపాస్ రోడ్డు వేశారు. మంచిర్యాల వైపు నుంచి వచ్చే వాహనాలు హైవే నుంచి జిల్లా కేంద్రంలోకి రావడానికి.. జిల్లా కేంద్రంలోని వాహనాలు హైవే పైకి వెళ్లడానికి పాత రహదారిని ఉపయోగించారు.
అయితే, హైవేపై వెళ్లే వాహనాల వేగం ఎక్కువగా ఉండడం వల్ల, జిల్లా కేంద్రం నుంచి హైవే పైకి.. హైవే నుంచి జిల్లా కేం ద్రానికి వాహనాలు వచ్చేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గు ర్తించి, జిల్లా కేంద్రం నుంచి హైవే పైకి వెళ్లడానికి ఉన్న రహదారిని మూసివేశారు. గుండి ప్రధాన రోడ్డు మీదుగా బైపాస్ నుంచి హైవే పైకి వెళ్లడానికి వాహనాలకు అనుమతి ఇచ్చారు. కాగా, జిల్లా కేంద్రంలోని గుండి దారి పక్కన నివాసముంటున్న వారికి ఇదే శాపంగా మారిం ది. ఈ రోడ్డు గుంతలమయమై.. కంకర తేలి అధ్వానంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణ చేపట్టాలని గత నెలలో కాలనీవాసులు కలెక్టర్కు వినతి పత్రం సైతం అందజేశారు.
జిల్లా కేంద్రం నుంచి గుండి ద్వారా వన్ వే ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా మంచిర్యాల వైపు వాహనాలు వెళ్లడానికి అధికారులు నిర్ణయించారు. స్థానిక ప్రధాన రహదారి నుంచి బైపాస్ వరకు అప్రోచ్ రహదారి నిర్మించలేదు. నిత్యం వందలాది వాహనాలు ఈ దారి గుండా వెళ్తుండడంతో దుమ్మూధూళి లేచి స్థానికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే ప్రాంతంలో పాఠశాల ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు.
అసలే ఇరుకుగా ఉన్న గుండి రోడ్డుకు వెళ్లే మూలమలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడ బస్సులు, లారీలు ఇతర పెద్ద వాహనాలు తిప్పడం కష్టంగా మారిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించాలని ప్రజలు, వాహనదారులు వేడుకుంటున్నారు.