మంచిర్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, ఆ ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం కదిలిరావడం విమర్శలకు తావిస్తున్నది. ఈ ఘటన సోమవారం చెన్నూర్ పట్టణంలోని శ్రీ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరగడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరోంచ తాలూక కారస్పల్లి గ్రామానికి చెందిన గర్భిణి రాపల్లి మంగ (28) ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు చెన్నూర్ పట్టణంలోని శ్రీ కిరణ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కు వచ్చింది. డాక్టర్ సోమవారం ఉదయం మంగకు ఆపరేషన్ చేయగా, పాప పుట్టింది.
అనంతరం బాలింత పరిస్థితి విషమంగా మారడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవే ట్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా డాక్టర్ సూచించారు. అంతేగాకుండా వారే స్వయంగా ప్రైవేట్ అంబులెన్స్ను పిలిపించి.. వెంటిలేటర్ ఏర్పాటు చేసి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు మంగ మృతదేహంతో చెన్నూర్కు వస్తుండగా జైపూర్లో పోలీసులు అడ్డుకున్నారు. మంగ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని తిరిగి మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. మంగకు ఇది రెండో కాన్పు.
వైద్యం వికటించడంతోనే మంగ మృతి చెందిందని బంధువులు, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీ గోపినాథ్, చెన్నూర్ డివిజన్ అధ్యక్షుడు మసాని రమేశ్, నాయకులు తగరం వెంకటేశ్, రవి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాలింత మృతికి కారణమైన డాక్టర్పై తగిన చర్యలు తీసుకొని, మృతురాలి కుంటుంబానికి తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన జరుగకుండా పోలీసు యంత్రాంగం మొత్తం కిరణ్ ఆసుపత్రికి సహకరించిందని పలువురు ఆరోపించారు. ఇక్కడ చికిత్స వికటించడం, బంధువులు ఆందోళన చేయడం సాధారణ విషయం. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే ఇలాంటి రెండు.. మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి.
కానీ.. ఈ కేసు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిచ్చినైట్లెంది. ఏదైన లా అండ్ ఆర్డర్కు సంబంధించిన సమస్య వస్తేనే వారి పరిధిని దాటివెళ్తారు. కానీ.. చెన్నూర్ సీఐ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ముందు కాపలా కాయడం వెనుక ఆంతర్యమేమిటోనని పలువురు మాట్లాడుకోవడం గమనార్హం. ఇదే సమయంలో కోటపల్లి సీఐ చెన్నూర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో మాట్లాడారు. మరోవైపు ఇందారం, శ్రీరాంపూర్ ఏరియాల్లో డెడ్ బాడీ చెన్నూర్కు రాకుండా మోహరించినట్లు కూడా తెలిసింది.
ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఓ పోలీసు ఉన్నతాధికారికి రూ. లక్షలు ముట్టజెప్పి, విషయం బయటకు రాకుండా చూడాలని కోరినట్లు తెలిసింది. దీంతో సదరు అధికారి తన పరిధిలోని సీఐ, ఎస్సైలను ఈ పనికి పురమాయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం ఎందుకు కదిలింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుల పక్షాన ఉండాల్సిన అధికారులే.. ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయమై జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ వివరణ కోరగా.. చెన్నూర్లో ధర్నా, ఆందోళన జరుగకుండా ఉండాలనే ఉద్దేశంతో తమ చెన్నూర్ సీఐ మంచిర్యాల వరకు వెళ్లారని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, కిరణ్ హాస్పిటల్ ముందున్న ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి 9.30 గంటల దాకా బంధువులు, నాయకులు ఆధ్వర్యంలో రాస్తారోకో కొనసాగుతున్నది.