ఖానాపూర్, జూన్ 12: రోగి మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. మృతుడి కుమారుడు షేక్ షారుఖ్ మాట్లాడుతూ సుర్జాపూర్ గ్రామానికి చెందిన తన తండ్రి షేక్ హుస్సేన్(55)కు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో తీవ్ర శరీర నొప్పులు, ఛాతి నొప్పి, అధిక చెమటలు రావడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి సూచన మేరకు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
పరిస్థితిని వివరించినప్పటికీ, కేవలం ఇంజెక్షన్, మూడు మాత్రలు మాత్రమే దవాఖానలోని వైద్య సిబ్బంది ఇచ్చారని, బీపీ, షుగర్ పరీక్షలు చేయలేదని, డ్యూటీ డాక్టర్ కూడా పరిశీలించలేదని ఆరోపించారు. దాదాపు 40 నిమిషాల పాటు దవాఖానలో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదేరోజు తెల్లవారుజామున తన తండ్రి పరిస్థితి విషమించడంతో మళ్లీ దవాఖానకు తీసుకురాగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు.
హుస్సేన్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డిని వివరణ కోరగా డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బందికి కేవలం ఒళ్లు నొప్పులున్నాయని తెలుపడంతో చికిత్స అందించారన్నారు. సిబ్బంది అనుమతి తీసుకోకుండా బంధువులు రోగిని ఇంటికి తీసుకెళ్లారని ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు.