బోథ్, నవంబర్ 27: అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని డీటీ రాథోడ్ ప్రకాశ్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలోని 49 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు, వివాహితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, సవరణల కోసం మొదటి రోజు 335 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రెండో రోజున నిగినిలో డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్ 18 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ అతిఖొద్దీన్, ఎన్నికల విభాగం డీటీ సూరజ్, ఆర్ఐలు సునీ త, దశరథ్ సందర్శించి దరఖాస్తుల తీరును పరిశీలించారు.
బోథ్, నవంబర్ 27: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహసీల్దార్ అతిఖొద్దీన్ పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన వారు చేసుకున్న దరఖాస్తుల వివరాలను బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ దశరథ్, శ్యాంసుందర్రెడ్డి, బీఎల్వోలు పాల్గొన్నారు.
నార్నూర్, నవంబర్ 27 : ఓటరు జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించాలని ఆసిఫాబాద్ ఆర్డీవో జాడి రాజేశ్వర్ బీఎల్వోలకు సూచించారు. గాదిగూడ మండలం లోకారి(కే), దాబా(కే), గాదిగూడ, ఖడ్కి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్వోలకు పలు సూచనలు ఇచ్చారు. డిసెంబర్ 3,4వ తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సూపర్వైజర్ ప్రభావతి, అనసూయ ఉన్నారు.
నార్నూర్ మండలం తాడిహత్నూర్, మాన్కాపూర్, నార్నూర్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను ఆసిఫాబాద్ ఆర్డీవో జాడి రాజేశ్వర్ పరిశీలించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే ఓటర్ల జాబితాను తయారు చేసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. ఆయన వెంట ఆర్ఐ రాథోడ్ కవిత, తదితరులు ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, నవంబర్ 27: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహసీల్దార్ భోజన్న పరిశీలించారు. ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేపట్టాలని బీఎల్వోలకు సూచించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్, సిబ్బంది జామ, సద్దామ్, బీఎల్వోలు ఉన్నారు.