ఇది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బన్పల్లి ప్రాథమిక పాఠశాల. 2013లో ఇందులో ఉన్నది కేవలం 24 మంది విద్యార్థులే. ఇగ మూత పడుతుందనుకునే దశలో.. 2016లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. నాడు పిల్లలు లేక వెల వెలబోయిన ఈ బడిలో నేడు నో అడ్మిషన్స్ బోర్డు పెడుతున్నారు. దాతలు, గ్రామస్తుల సహకారంతో హెచ్ఎం అర్చన ఉపాధ్యాయులతో కలిసి కార్పొరేట్కు దీటుగా మెరుగైన విద్యనందిస్తూ పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. కాగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించనుండగా, సర్కారు బడులన్నీ సక్సెస్ సాధిస్తాయనడానికి ఈ పాఠశాలే నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
దండేపల్లి, జనవరి 30 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బన్పల్లి ప్రాథమిక పాఠశాల(ఒకటి నుంచి ఐదో తరగతి వరకు)లో అడుగు పెట్టగానే ఆశ్చర్యపోతాం. నిజంగా ఇది సర్కారు బడేనా.. అని అనిపిస్తుంది. సాధారణంగా ప్రైమరీ స్కూలు అంటే బెంచీలు కూడా ఉండవు. పిల్లల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి తరగతి గదీ విద్యార్థులతో నిండి కనిపిస్తుంది. ఎటు చూసినా రంగురంగుల ఫర్నిచర్, డెస్క్ బెంచీలు, స్క్రీన్పై పాఠాలు, కంప్యూటర్లు.. తదితర సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా కనిపిస్తుంది.
నాడు 24 మంది.. నేడు 256 మంది..
2012-13 విద్యాసంవత్సరంలో పాఠశాలలో 24 మంది మాత్రమే ఉండగా, నేడు 256 మంది విద్యార్థులతో కళకళలాడుతున్నది. 2013లో పాఠశాలకు బదిలీపై వచ్చిన హెచ్ఎం అర్చన విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేశారు. 2013-14లో 52 మంది, 2014-15లో 70 మంది ఇలా క్ర మంగా పెరుగుతూ వచ్చారు. 2016లో పాఠశాలలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థుల సంఖ్య 75కు పెరిగింది. 2016-17లో 143 మంది, 2017-18లో 210, 2019-20 లో 243 మంది, 2020-21లో 250 మంది, 20 21-22లో 256 మంది విద్యార్థులు చేరారు. కరో నా టైంలో కూడా అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొన డం గమనార్హం. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు గ ల పాఠశాలగా గుర్తింపు పొందింది. మూడేళ్లుగా పా ఠశాల ఎదుట నో అడ్మిషన్ల బోర్డు తగిలిస్తున్నారం టే ఎంతగా సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
దాతల పెద్ద మనసు
రెబ్బన్పల్లికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి సంగనబట్ల రాజేంద్రప్రసాద్ పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృ ష్టి సారించారు. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేశా రు. బ్రింగ్ ఏ స్మైల్, సూరి ఫౌండేషన్, ఆయేషిని ఫౌండేషన్, రామక్రిష్ణ, శ్రీకాంత్ అనే ఇద్దరు ఎన్ఆర్ఐల సహకారంతో పాఠశాలలో డబుల్ డెస్క్ బెంచీలు, ప్రొజెక్టర్, కంప్యూటర్లు, శుద్ధజల ప్లాంటు వంటివి ఏర్పాటు చేశారు. ఆకర్షణీయమైన పెయిటింగ్స్తో స్కూల్ను సుందరంగా తీర్చిదిద్దారు.
ఉచితంగా నోట్బుక్స్, బ్యాగ్స్, సాయంత్రం పూట అల్పాహారం అందిస్తున్నారు. దాతల సహకారానికి తోడు పాఠశాల హెచ్ఎం అర్చన కూడా ప్రతినెలా వేతనం నుంచి రూ.8 వేలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది.
ముందు చూపుతో ఆంగ్ల మాధ్యమం
ఆంగ్ల మాధ్యమానికి ఆదరణ పెరుగుతుండడంతో హెచ్ఎం అర్చన ముందు చూపుతో 2016లో ఆంగ్ల మాధ్యమం బోధనకు ప్రతిపాదించారు. అన్ని వర్గాల నుంచి సహకారం లభించడంతో అమల్లోకి తెచ్చారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని హెచ్ఎం అర్చన భావించడంతో సర్కారుబడికి ఆదరణ పెరిగింది. సమీప గ్రామాలైన నెల్కివెంకటాపూర్, ఇప్పలగూడెం, ముత్యంపేట,చింతపెల్లి, లక్షెట్టిపేట మండలం ఎల్లారం, దండేపల్లి మండల కేంద్రం నుంచి విద్యార్థులు వస్తున్నారంటే బడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాల జిల్లాలో ఏ ఒక్క ప్రాథమిక పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు లేరు.
ప్రైవేటుకు దీటుగా కార్యక్రమాలు…
కార్పొరేట్ పాఠశాల తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు, కరాటే శిక్షణ, ప్రాజెక్ట్ వర్క్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వెనుకబడిన తరగతులపై ప్రత్యేక శ్రద్ధ వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. పాఠశాల హెచ్ఎం గిరిజన గూడెమైన ఇప్పలగూడెం నుంచి విద్యార్థులను ఆటోల ద్వారా సొంత ఖర్చులతో రప్పిస్తున్నారు.
గదుల కొరత తీరితే మరిన్ని అడ్మిషన్లు..
పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించినప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాతల సహకారంతో వసతులు కల్పిస్తున్నాం. గదుల కొరత ఉంది. విద్యార్థులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో 256 మంది విద్యార్థులతోనే అడ్మిషన్లు నిలిపివేశాం. గదుల కొరత తీర్చితే మరిన్ని అడ్మిషన్లు పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నది. దీంతో అన్ని పాఠశాలలు బలోపేతమవుతాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం సంతోషాన్నిచ్చింది.