స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని సర్కారు అందిస్తున్న సహకారంతో మునుపెన్నడూ చూడని విధంగా ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ఎమ్మెల్యే జోగు రామన్న పట్టుదల, కృషితో రూపురేఖలు మార్చుకుంటున్నది. తొమ్మిదేళ్ల పాలనలో విద్య, వైద్యం, సాగు, తాగునీరు, రవాణా, వ్యవసాయరంగాలకు అందిన చేయూతతో అన్నివర్గాలకూ భరోసా దక్కింది. అవసరమైన చోట రోడ్లు, వంతెనలు అందుబాటులోకి రావడంతో గణనీయ మార్పు సాధ్యమైంది. ముఖ్యంగా ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అందుబాటులోకి రావడంతో సాగు పెరిగింది. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం, పీహెచ్సీల్లో వసతుల కల్పనతో అన్ని రకాల అధునాతన వైద్యం పేదల దరిచేరింది. ఇలా ఒక్కటేమిటి.. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రగతిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం తొమ్మిదేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. వివిధ పథకాలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో ఉపాధి కోసం వలస పోయేవారు ఇప్పడు సొంత గ్రామాల్లో ఉంటూ సంతోషంగా జీవిస్తున్నారు.
సాగుభూములు సస్యశ్యామలం
మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలం కొరాట వద్ద ప్రభుత్వం రూ.1227 కోట్లతో చనాక, కొరాట ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. బరాజ్, కాలువలు, పంప్హాస్ పనులు పూర్తికాగా, త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన, నిర్మించిన చెరువులు సత్ఫలితాలనిస్తున్నాయి. రెండు పంటలకు సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగింది.
జిగేల్మనేలా ఆదిలాబాద్ పట్టణం
తొమ్మిదేళ్లలో ఆదిలాబాద్ పట్టణం ఎంతో మారింది. పట్టణ సుందరీకరణ పనులు, జంక్షన్ల అభివృద్ధి, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, ఎల్ఈడీ లైట్ల కోసం రూ.11.68 కోట్లు మంజూరు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా రూ.21 కోట్లతో అన్ని వార్డుల్లో బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఎంజీఎఫ్, పట్టణ ప్రగతి నిధులతో కమాండ్ కంట్రోల్ సెంటర్, హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్, డ్రైవేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్, ఇతర అధికారి భవన నిర్మాణం కోసం రూ.5.13 కోట్లు మంజూరు చేశారు. అలాగే రూ.25.53 కోట్లతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు అండ్ డ్రైన్ నిర్మాణం కోసం కేటాయించారు. బంగారిగూడలో డంపింగ్ యార్డు నిర్మాణం కోసం రూ.81 లక్షలు కేటాయించారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో రూ.2.4 కోట్లతో ఓపెన్ జిమ్ల ఏర్పాటు కోసం కేటాయించారు. హరితహారం మొక్కలు నాటడం, పార్కుల ఏర్పాటుకు రూ.11.30 కోట్ల నిధులు మంజూరు చేశారు. శానిటేషన్ కోసం ఆటో, ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు రూ.8.74కోట్లు కేటాయించారు. ఇండోర్ స్టేడియం, ఐపీ స్టేడియంల అభివృద్ధి, డైట్గ్రౌండ్ రూ.2.20 కోట్లతో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు. పలు కాలనీల్లో రూ.4.13 కోట్లతో వైకుంఠధామాల అభివృద్ధి, రూ.1.53 కోట్లతో నీటి సరఫరా పనులు, రూ.8.18 కోట్లతో నర్సరీల అభివృద్ధి, అప్రోచ్ రోడ్లు ఇతర పనులు పూర్తిచేశారు.
అభాగ్యులకు అండగా ఆసరా
ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులకు నామ్కేవాస్తేగా పింఛన్లు ఇచ్చేవారు. అవి కూడా సమయానికి ఇచ్చేవారు కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకం అమలు చేస్తుండడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులు, ఇతరులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల, జైనథ్, బేల మండలాల్లో 27,430 మంది పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.5.80 కోట్లను మంజూరు చేస్తున్నది. సర్కారు అందిస్తున్న సాయంతో తమ అవసరాలు తీర్చుకుంటున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ హరితవనం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం, ఆహ్లాదం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ హరితవనం పచ్చదనం, పక్షులు, జంతువులతో కనువిందు చేస్తున్నది. వెయ్యి ఎకరాల అటవీ ప్రాంతాన్ని రూ.3 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రజలకు వాకింగ్, సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. బోటింగ్, సాహసక్రీడలను కూడా ఏర్పాటు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంగా మారడంతో ప్రజలు పార్కుకు వచ్చి సేదతీరుతున్నారు.
మున్సిపల్ పార్కులు
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉన్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొనగా, స్థానికులు, చిన్నారుల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కుల్లో పలు రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో స్థానికులు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చిన్నారులకు ఆట వస్తువులను కూడా అందుబాటులో ఉంచారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట
రిమ్స్తో పాటు పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా చోట్ల ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు చేస్తున్నది. ఇందుకోసం టీ డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులోకి తెచ్చి, 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నది. రూ.150 కోట్లతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించారు. కార్డియాలజీ, న్యూరో, యూరాలజీ, పిడియాట్రిక్, తదితర సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు ఉచితంగా కీళ్ల మార్పిడి వైద్యం చేస్తున్నారు. రూ..1.56 కోట్లతో బేల పీహెచ్సీ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.20 లక్షల చొప్పున 6 సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి.
దళితుల సంక్షేమానికి పెద్దపీట
దళితుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబస్తీ, దళితబంధు పథకాలు వారి ఉపాధిని మెరుగుపరుస్తున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో దళితబస్తీలో భాగంగా 864 వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికీ మూడెకరాల చొప్పున 2229 ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 97 కోట్లు ఖర్చు చేసింది. దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున రూ.10 కోట్లను అందజేసింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్ధరిలో 45 మంది, లోహరలో 31 మంది, కొత్తగూడలో 13 మంది, యాపల్గూడలో ముగ్గురు, బేల మండంల టాక్లీలో ముగ్గురు, పొన్నాలలో ముగ్గురు, శంషాబాద్లో ఒక్కొక్కరికి దళితబంధు ద్వారా ఉపాధి లభిస్తున్నది.
‘సాత్నాల’ ఆధునీకరణ
జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు ఆయకట్టు నీటి నిల్వ సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 8 వేల ఎకరాలకు మించి సాగునీరు అందేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాత్నాల ప్రాజెక్టును ఆధునీకరించింది. సాత్నాల కుడి కాలువ కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో లక్ష్మీపూర్ రిజర్వాయర్ కింద చివరి ఆయకట్టు వరకు నీరందేది కాదు. కాలువల లీకేజీలు, మిగతా నిర్మాణాలు సరిగా లేకపోవడంతో నీరంతా వృథాగా పోయేది. దీంతో సగానికి పైగా ఆయకట్టు రైతుల భూములకు నీరు రాక పంటలు నష్టపోయేవారు. స్వరాష్ట్రంలో పూర్తిగా మరమ్మతులు చేపట్టడంతో, చివరి ఆయకట్టుకూ సాగునీరందుతున్నది.
విద్యారంగంలో ప్రగతి
మన ఊరు- మనబడి, మనబస్తీ- మన బడి కార్యక్రమం ద్వారా రూ.20 కోట్లతో మొదటి విడుతలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 78 పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించారు. బేలలో బీసీ బాలుర గురుకులం ప్రారంభించారు. రూ.120 కోట్లతో 4 మైనార్టీ, రెండు బీసీ గురుకులాలను నిర్మించారు. జిల్లా కేంద్రంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మిస్తున్నారు. జైనథ్ మండలం కేంద్రంలో రూ.3.58 కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.
మెరుగైన రవాణా సౌకర్యం
రూ. 45 కోట్లతో ఆదిలాబాద్ నుంచి బేల వరకు డబుల్ లేన్ రహదారి నిర్మించారు. ఆదిలాబాద్ పట్టణంలో రూ.63.29 కోట్లతో రోడ్ల విస్తరణ, సీసీరోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టారు. ఆదిలాబాద్ నుంచి కెరమెరి రోడ్డు రహదారిపై రూ.10 కోట్లతో మూడు వంతెనలు నిర్మించారు. జామిని నుంచి పెన్గంగ రోడ్డును వెడల్పు చేయడానికి రూ.10 కోట్లు కేటాయించారు. బేల, ఆదిలాబాద్ పట్టణంలో రోడ్ల మరమ్మతులు, వెడల్పు కోసం రూ.4.30 కోట్లు మంజూరు చేశారు. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి , అండర్ బ్రిడ్జీల కోసం రూ.87.20 కోట్లు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.
1121 మందికి సీఎంఆర్ఎఫ్
అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకున్న పేదలకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తొమ్మిదేళ్లుగా 1121 మందికి రూ.5.75 కోట్లను సీఎంఆర్ఎఫ్ పథకంలో భాగంగా పంపిణీ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో పేదలు తమ ఆరోగ్యంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల మరమ్మతులకు రూ. 19 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది.
11,971 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్, బేల మండలాల్లోని 11,971 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వల్ల ప్రయోజనం చేకూరింది. ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం నియోజకవర్గంలో రూ. 12.11 కోట్లను మంజూరు చేసింది.
దళిత బంధుతో ఉపాధి
దళిత బంధు పథకంతో నాలాంటి పేదోళ్లకు మంచి జరిగింది. సర్కారు అందించిన సాయంతో బేల మండల కేంద్రంలో బట్టల దుకాణం పెట్టుకున్నం. దీంతో పాటు నా భర్త మేకలను కొనుగోలు చేసిండు. గతంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాళ్లం. పని దొరికితే గాని పూట గడవని పరిస్థితి ఉండె. ఇప్పుడు సర్కారు అందించిన సాయంతో దర్జాగా బతుకుతున్నం. అన్ని ఖర్చులు పోను నెలకు ఆరేడు వేల ఆదాయం వస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం మా లాంటి పేదల గురించి పట్టించుకోలె. తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం ఎప్పటికీ మరువలెం.
– యాముర్లవార్ రేఖ, పొనాల, బేల మండలం
తొమ్మిదేళ్లలో గణనీయ ప్రగతి
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆదిలాబాద్ జిల్లాను చిన్నచూపు చూశారు. ఫలితంగా ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. రూ.40 కోట్లతో ఐటీ టవర్ కూడా ఆదిలాబాద్లో నిర్మిస్తున్నాం. మన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రజలు కూడా వారి గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాల ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. గతంలో ఉపాధి కోసం వలస పోయేవారు ఇప్పడు గ్రామాల్లో వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు. రోడ్లు, వంతెనలు ఇలా అన్ని అందుబాటులోకి వచ్చాయి, – జోగు రామన్న, ఎమ్మెల్యే (ఆదిలాబాద్)
సర్కారే ‘ఆసర’య్యింది.
గతంలో ఏ సర్కారు కూడా ముసలోళ్ల గురించి పట్టించుకోలె. దీంతో నాలాంటి ముసలోళ్లు చాలా ఇబ్బందులు పడ్డరు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు రూ. 2016 పింఛన్ ఇస్తున్నడు. మందు గోళీలు, ఇతర ఖర్సులకు ఈ రూపాలు మస్తు పన్జేస్తున్నయ్. గిప్పుడు ముసలోళ్లకు అన్ని రకాల సౌలతులు అందుతున్నయ్. సర్కారు దవాఖాన్లకు పోతే పైసా ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు చేస్తున్నరు. నేను కూడా కంటి వెలుగుల టెస్టులు చేయించుకన్న. డాక్టర్లు మంచిగ పరీక్షించిన్రు. అద్దాలు, మందులు ఇచ్చిన్రు. తెలంగాణొస్తే ఇంత మంచిగ ఉంటదని ఆనాడు కేసీఆర్ చెప్పిండు. ఇయ్యాల సీఎంగా ఆయన అంతా మంచే జేస్తున్నడు. గిట్ల జేసుడు ఇంకే లీడరుతోని కాదు.
– అమృత, పింఛన్ లబ్ధిదారు, రిక్షాకాలనీ, ఆదిలాబాద్
ప్రైవేట్ దవాఖాన్లకు పోతలెం..
గతంలో వైద్యం కోసం ప్రైవేటు దవాఖాన్ల చుట్టూ తిరిగి ఖర్సు బాగయ్యేది. మందులు, ఎక్స్రేలు, పరీక్షలు అంటూ వేలవేలకు గుంజెటోళ్లు. తెలంగాణ అచ్చినంక ఇప్పుడా తిప్పలు తప్పినయ్. సర్కారే అన్ని ఫ్రీగా చేస్తున్నది. ఇంటి నుంచి అంబులెన్స్లో సర్కారు దవాఖానకు తీసుకుపోయి కాన్పు అయిన తర్వాత ఇంటి వద్ద అదే వాహనంలో దింపుతున్నది. నాకు అర్ధరాత్రి పూట పురిటినొప్పులు అచ్చినయ్. దీంతో మా ఇంట్లోళ్లు 102 అంబులెన్స్కు ఫోన్ చేసిన్రు. వారు వెంటనే వచ్చి నన్ను బేల దవాఖానకు తీసుకుపోయిన్రు. కాన్పు అయినంక అదే వాహనంలో ఇంటికి తీసుకొచ్చిన్రు. అమ్మఒడి పథకంలో భాగంగా రూ.13 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు కేసీఆర్ కిట్ ఇచ్చి మరీ పంపించిన్రు. ఇప్పుడు మారుమూల పల్లెల్లో కూడా సర్కారోళ్ల వైద్యం పన్జేస్తున్నది.
– కొడప అయ్యుబాయి, గణేశ్పూర్, బేల మండలం