ఆదిలాబాద్, ( నమస్తే తెలంగాణ)/భైంసా/కుభీర్, సెప్టెంబర్ 30 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 9.77 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 3.52 లక్షల ఎకరాల్లో, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 3.37 లక్షల ఎకరాలు, నిర్మల్లో 1.31 లక్షల ఎకరాలు, మంచిర్యాలలో 1.57 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. జూలైలో కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని పంటకు నష్టం వాటిల్లింది. తర్వాత వాతావరణం పంట సాగుకు సహకరించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో తెల్లబంగారం సాగుకు అనుకూలమైన నల్లరేగడి నేలలు, పంటసాగులో రైతులకు అనుభవం ఉండడంతో పత్తి లాభాలను తెచ్చి పెడుతున్నది. గత ఏడాది రికార్డు స్థాయిలో పత్తి క్వింటాల్కు రూ.12 వేల ధరతో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏటా జూన్ మొదటి, రెండో వారంలో రైతులు పత్తి పంట వేయగా, అక్టోబర్ రెండో వారంలో దిగుబడులు ప్రారంభమవుతాయి. పంటలో తెగుళ్ల నివారణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్ వచ్చే అవకాశాలున్నాయి. ఆక్టోబర్ రెండో వారంలో ప్రారంభమైన కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రికార్డు ధర..
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పత్తి ధర పలుకనున్నది. ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాకు రూ.6,380 మద్దతు ధర ప్రకటించగా.. సీజన్ ప్రారంభంలోనే తెల్లబంగారానికి గణనీయమైన ధర లభిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేల్ ధర రూ.60 వేలు పలుకుతున్నది. పత్తిని ఎక్కువగా పండించే చైనా, పాకిస్తాన్ దేశాల్లో వర్షాల కారణంగా నష్టం వాటిల్లింది. దీంతో అక్కడ దిగుబడులు తక్కువగా ఉండడంతో ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు ధరలు బాగా పెరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రైవేట్ వ్యాపారులు పంట కొనుగోళ్లను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కుభీర్లో ఓ వ్యాపారి క్వింటాల్కు రూ.10,016 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేయనున్నారు. ఫలితంగా రైతులకు ఎక్కువ ధరలు లభించే అవకాశాలున్నాయి.
చాలా సంతోషంగా ఉంది..
మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ యేడాది వానలు బాగా కురియడంతో దిగుబడి తగ్గుతుందని భయపడ్డాం. కలుపు తీయడానికి కూడా బాగా డబ్బులు ఖర్చయ్యాయి. ధర ఎట్లుంటదో అని మదనపడ్డాం. కానీ.. మేము అనుకున్న దాని కంటే ధర బాగా పలుకుతున్నది. ప్రారంభంలోనే రూ.10వేలు చెల్లిస్తుండడం ఆనందంగా ఉంది. పోయినేడాది క్వింటాల్ పత్తి రూ.6 వేలకే అమ్ముకున్నాం.. ఈసారి మాత్రం రూ.10 వేల చొప్పున అమ్మిన. రూ.20 వేలకుపైగా డబ్బులు వచ్చాయి.
– మున్షిరాం టోపా ఆడే, రైతు, డోడర్న
అంతర్జాతీయ మార్కెట్పై ఆధారం
పత్తి ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి. దిగుబడిపై కూడా దీనికి ఒక కారణం. ఇవే ధరలు నిలకడగా ఉంటాయని అనుకోలేం. గతేడాది సీజన్ ప్రారంభంలో క్వింటాల్ ధర రూ.6 వేలు ఉండగా.. డిసెంబర్, జనవరి నాటికి రూ.10వేల వరకు చేరింది. ధరలు మంచిగా ఉంటేనే రైతులు ఆనందంగా ఉంటారు. వారు ఆనందంగా ఉంటే అందరం బాగుంటాం.
– రెడ్డిశెట్టి ఆనంద్, వ్యాపారి, కుభీర్
కష్టానికి ఫలితం లభించింది..
నాకు ఎకరన్నర వ్యవసాయ భూమి ఉంది. కుభీర్ మార్కెట్కు 71 కిలోలు తీసుకొచ్చి అమ్మిన. రూ.7,100 వచ్చాయి. మద్దతు ధర కంటే అధికంగా డబ్బులు రావడం ఆనందంగా ఉంది. కొన్నేండ్ల నుంచి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడ్డాం. పెట్టుబడికి కూడా ఆ డబ్బులు చాలకపోవడంతో వ్యవసాయమే మానేద్దామనుకున్నా. నా కష్టానికి ఫలితం లభించింది.
– ఆడే ఉమేశ్, రైతు, కిషన్నాయక్ తండా, కుభీర్