తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ ( Tandur ) మండలంలో మట్టి అక్రమ రవాణా ( Soil Illegal Transportation ) కు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికార యంత్రాంగం ‘మామూలు’ గా వ్యవహరిస్తుండడంతో మట్టి అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారయ్యింది. కనీస నిబంధనలు పాటించకున్నా కూడా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయలు గండిపడుతోంది.
రైల్వే పేరిట అనుమతులు..

మండల పరిధిలో కొనసాగుతున్న రైల్వే విస్తరణ ( Raliway Expension ) పనుల కోసం మట్టి రవాణా చేసుకునేందుకు పొందిన అనుమతులు మట్టి అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. రైల్వే మూడో లైన్ విస్తరణ కోసం మట్టి సరఫరా అంతంత మాత్రంగానే ఉండగా ప్రైవేటు భూములకు యథేచ్ఛగా రవాణా జరుగుతోంది. లారీ ట్రిప్పుకు రూ. 3వేల నుంచి రూ. 5 వేల వరకు దండుకోవడం చూస్తుంటే ఈ అక్రమార్జన ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు ప్లాట్లకు, ప్రైవేటు వెంచర్లకు ఈ మట్టి వందల ట్రిప్పుల మేర తరలిపోతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం పగటిపూట మాత్రమే మట్టి తరలింపు చేయాల్సి ఉండగా అక్రమార్కులు మాత్రం ఈ దందాకు రాత్రి సమయాన్ని ఎంచుకొని తమ దందాను సాఫీగా కొనసాగిస్తున్నారు.

అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట
రైల్వే విస్తరణ కోసం 10వేల క్యూబిక్ మీటర్ల మట్టి చేరవేసేందుకు మండలంలోని
అంకెపెల్లి చెరువు శివారు నుంచి సదరు కాంట్రాక్టర్ అనుమతి తీసుకున్నారు. కానీ అంకెపెల్లి చెరువు నుంచే కాకుండా కిష్టంపేట మేకల వాణి చెరువు, అన్నారం చెరువు తోపాటు , బోయపల్లి శివారులోని గుమ్మలకుంట నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.
మట్టి తవ్వకాలు కూడా కనీసం నిబంధనలు పాటించకుండా చేపడుతున్నారు. మట్టి తవ్వకాలు చెరువు మత్తడికి సరిసమానంగా తీయాల్సి ఉండగా ఒకే చోట నుంచి లోతుగా మట్టి తీస్తున్నారు. ఇప్పుడు వారి అవసరాల కోసం తీస్తున్న లోతైన గుంతలు వర్షాకాలంలో ప్రజలకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.నీటిపారుదల శాఖ, భూగర్భ శాఖ ల నిర్లిప్తత మట్టి అక్రమార్కుల పాలిట వరంగా మారుతుందని పేర్కొన్నారు.
అధికార పార్టీ నాయకుల కనుసన్నులలోనే ..?

ఈ మట్టి దందా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు బడా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ దందాను కొనసాగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సంబంధిత అక్రమార్కులకు నియోజకవర్గ ముఖ్య నేత సైతం సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేలుకొని అక్రమార్కులకు అడ్డుకట్ట వేసి ఈ దందాను సమూలంగా నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చట్ట పరమైన చర్యలు
ఇరిగేషన్ ఎస్ఈ విష్ణుబాబును వివరణ కోరగా.. అనుమతులు లేకుండా చెరువుల నుంచి మట్టి తరలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం రైతులు మాత్రమే పంట పొలాలకు చెరువులు మట్టి తరలించేందుకు అనుమతులిస్తున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి రైతులు ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. చెరువులలో నిబంధనల మేరకే మట్టి తవ్వకాలు జరపాలి. నిబందనలు అతిక్రమించి ప్రైవేటు ప్లాట్లకు, ప్రైవేటు వెంచర్లకు మట్టి తరలిస్తే చర్యలు తప్పవన్నారు. స్థానిక ప్రజలు ఎవరు గమనించినా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకవస్తే వాహనాలను సీజ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు..