మంచిర్యాల ఏసీసీ, మార్చి 15 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. జైపూర్ మండలం ఎస్టీపీపీలో శుక్రవారం మహారాష్ట్ర, రామగుండం పోలీస్ కమిషనరేట్ సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సరిహద్దులో చెక్పోస్ట్లు ఏర్పాటు చేయడంతో పాటు, మద్యం, డబ్బు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పకడ్బందీ తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఎన్బీడబ్ల్యూ వారెంట్స్ విషయంలో రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవాలని, ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించి ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ గడ్చిరోలి(ఆపరేషన్స్) యతీశ్ దేశ్ముఖ్, అహేరి అదనపు ఎస్పీ ఎం రమేశ్, బెజాపూర్ అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వైభవ్ బ్యాంకర్, భూపాలపల్లి అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎన్ భుజంగ రావు, కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్) ఆర్ ప్రభాకర్ రావు, బెజాపూర్ అదనపు ఎస్పీ (అడ్మిన్) చంద్రకాంత్ గవర్న, వోఎస్డీ గ్రేహౌండ్స్ జీ దయానంద్, సిరోంచా, నిర్మల్, కాగజ్నగర్ ఎస్డీపీవోలు సందేశ్ నాయక్, ఏ గంగారెడ్డి, ఏ కరుణాకర్, రామగుండం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, జైపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రకాశ్, రవి కుమార్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.