ఆదిలాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : అభయహస్తం పథకంలో భాగంగా ఐదు గ్యారెంటీల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట గ్రామసభలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామాల్లో బృందాలను ఏర్పాటు చేసి ఎనిమిది రోజులపాటు అర్జీలు తీసుకున్నారు.
తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోల పర్యవేక్షణలో గ్రామసభలు కొనసాగాయి. కాగా.. జైనథ్ మండలంలోని జామ్నిలో ప్రజాపాలనను ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రారంభించగా.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని స్వీకరించారు. అధికారులు మాత్రం దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు.
ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్, ఆధార్ కార్డులు తప్పనిసరిగా జతపర్చాలని ప్రభుత్వం సూచించింది. ఆధార్కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కుటుంబసభ్యుల చేరికలు, చిరునామా మార్పు, ఫోన్ నంబరు పొందపర్చడం కోసం ఆధార్ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాశారు. ఆధార్ అప్డేట్ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కేంద్రాలు జనంతో రద్దీగా కనిపించాయి. దరఖాస్తుల స్వీకరణను జిల్లా అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రూ. 2,500ల ఆర్థిక సాయం, రూ.500 సిలిండర్, రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి రూ.15వేలు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఏడాదికి రూ.12 వేలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గృహజ్యోతి పథకంలో భాగం గా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, చేయూత పథకానికి దరఖాస్తులు అందజేశారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి ప్రశాంతి, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులు గ్రామసభలను పరిశీలించారు.