బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మికలోకం భగ్గుమన్నది. శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైంది. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలు దహనం చేసింది. రామగుండంలో ప్రజల సాక్షిగా మాట ఇచ్చి తప్పిన ప్రధాని మోదీపై మండిపడింది. సేవ్ సింగరేణి అంటూ నినాదాలతో హోరెత్తించింది.
రామకృష్ణాపూర్, డిసెంబర్ 9: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీపీ, ఆర్కే1ఏ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన తెలిపి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కొత్త గనులు సింగరేణికి దక్కకుండా, కార్మికుల వేతనాలను పెరుగకుండా డీపీఈ గైడ్ లైన్స్ పేరిట అడ్డుకుంటున్నారంటూ శుక్రవారం టీబీజీకేఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆర్కేపీ ఓసీపీ, ఆర్కే1ఏ గనులపై ప్రధాని దిష్టిబొమను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
రాష్ట్రంలోని సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకులను వేలాన్ని భేషరతుగా విరమించుకోవాలని, 11వ వేజ్ బోర్డులో వేతనాల పెరుగుదలకు అడ్డుగా ఉన్న డీపీఈ గైడ్లైన్స్ను ఎత్తివేయాలని, సత్వరమే వేజ్ బోర్డును పరిష్కరించాలని, 50 శాతం మినిమం గ్యారంటీ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్కేపీ ఓసీపీ పిట్ కార్యదర్శి కే రాజ్కుమార్, సహాయ కార్యదర్శి మిట్ట పోశం, నాయకులు సంగ బుచ్చయ్య, ఆర్కే1ఏ లో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్ రవీందర్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కోరబోయిన లక్ష్మణ్, నాయకులు కంభగోని సుదర్శన్గౌడ్, ఆడెపు రాజయ్య, పిట్ కార్యదర్శి బండారి భిక్షపతి, సహాయ కార్యదర్శి శివ, చేగొండ రాజయ్య, అమ్మ అశోక్, ఈరగోని సదయ్య తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి ఏరియాలో..
మందమర్రి రూరల్ డిసెంబర్ 9: ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్లపై నల్ల బాడ్జీలు ధరించి తమ నిసరన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ఇక్కడి కార్మిక శక్తిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. మందమర్రి ఏరియాలో కేకే 6 గని, శ్రావణ్పల్లి గనులకు ప్రైవేటీకరించ చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జే రవీందర్, ఓ రాజశేఖర్, బిల్లా మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.