దండేపల్లి, మార్చి 3 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన అంజన్న కూరగాయలు సాగు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుడిరేవులో అంజన్నకు 9 ఎకరాల భూమి ఉంది. ఇందులో 6 ఎకరాల్లో వరి, పత్తి సాగు చేస్తుండగా, మిగిలిన 3 ఎకరాల్లో ఏడాదంతా కూరగాయలు పండిస్తున్నాడు. ఎకరంన్నరలో మిర్చి, 20 గుంటల్లో వంకాయ, 20 గుంటల్లో టమాట, 20 గుంటల్లో గోబి, కాలిఫ్లవర్, బీర, కాకర, ఆకు కూరలు, కొత్తిమీర, సోరకాయ, అల్చింతలాంటి పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. జూన్లో విత్తనాలు విత్తి డిసెంబర్ వరకు ఒకసారి, జనవరిలో విత్తి వేసవి ముగిసే వరకు మరోసారి ఇలా యేడాదికి రెండు సార్లు కూరగాయలు సాగు చేస్తున్నాడు. రూ.80 వేలు పెట్టుబడి అవుతుండగా, రూ. 2లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నాడు.
భూమిలో డీఏపీలాంటి కాంప్లెక్స్ ఎరువులు వాడకుండా పశువుల పేడ, గొర్రెల ఎరువులు వేస్తున్నా డు. దుక్కికి ముందు పచ్చిరొట్ట సాగుచేసి గొర్రెల, పశువుల పేడ వేసి భూమిలోనే కలియ దున్నిపిస్తున్నాడు. రసాయనిక ఎరువులకు బదులు వేప, కా నుగ నూనే పిచికారీ చేస్తున్నాడు. ఇంటిల్లిపాదితో పాటు కూలీలతో పనులు చేయిస్తుంటాడు. ఎక్కువగా సేంద్రియ ఎరువులను వాడుతుండడం తో యేటాఆదాయం పెరుగుతుందని చెబుతున్నాడు.
చేతికొచ్చిన పంటను మంచిర్యాల, లక్షెట్టిపేట, ధర్మపురి, జన్నారంవంటి పట్టణ ప్రాంతాలకే కాకుండా తాళ్లపేట, మేదరిపేట, ముత్యంపేట, దండేపల్లి వార సంతలకు తరలిస్తుంటాడు. ఇందుకోసం ప్రత్యేకంగా టాటా ఏస్ వాహనాన్ని తీసుకున్నాడు. వాహనాన్ని సొంతంగా తనే నడుపుకుంటూ కూరగాయలను మార్కెట్లో వ్యాపారులకు అమ్ముతున్నాడు. పంటను సరైన రీతిలో మార్కెట్కు తరలించి, సొమ్ము చేసుకుంటున్నాడు. అన్ని కాలాల్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడం కలిసి వస్తుందని చెబుతున్నాడు. కూరగాయల సాగులో వ్యవసాయ, హార్టికల్చర్ అధికారుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
25 యేండ్ల నుంచి కూరగాయలు సాగు చేస్తున్న. కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడకుండా సేంద్రియ ఎరువులపైనే ఎక్కువ దృష్టి పెట్టిన. సేంద్రియ ఎరువులతోనే దిగుబడి వస్తుంది. ఎండకాలంలో కూడా కూరగాయలు పండిస్తున్నా. ఖర్చులుపోను రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. కూరగాయల సాగులో స్థానిక హార్టికల్చర్, వ్యవసాయాధికారుల సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సర్కారు నిరంతరాయంగా ఇస్తున్న కరెంటుతో వ్యవసాయ బావి నుంచి తోటలకు నిత్యం నీరందించడం వల్ల దిగుబడి బాగుంటుంది. గతంలో కరెంటు సరిగ్గా లేక దిగుబడి అంతంత మాత్రమే వచ్చేది. – మడిపెల్లి అంజన్న, రైతు, గుడిరేవు