మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. వానకాలంలో 1,57,443 ఎకరాల్లో వరి సాగు చేయగా, యంత్రాంగం ఇప్పటి వరకు 1.17 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇప్పటికే 6,281 మంది రైతులకు రూ. 98.53 కోట్లు జమ చేయగా, మిగతా వారికి త్వరలోనే చెల్లించే అవకాశమున్నది.
మంచిర్యాల అర్బన్, జనవరి 7 : జిల్లాలోని 270 కేంద్రాల్లో డీఆర్డీఏ(ఐకేపీ), పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. కలెక్టర్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ ప్రత్యేకాధికారులను నియమించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వడ్ల సేకరణ చేపడుతున్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా, లారీల సమస్య రాకుండా మూడు సెక్టార్ల ట్రాన్స్పోర్టర్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో వానకాలంలో 1,57,443 ఎకరాల్లో వరి సాగు చేశారు. కేసీఆర్ సర్కారు 24 గంటలు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయడంతో రంది లేకుండా పంటలు వేసి మంచి దిగుబడులు సాధించారు. ఇప్పటి వరకు జిల్లాలో 17,833 మంది రైతుల వద్ద 1,17,162.12 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 54 డీఆర్డీఏ ఐకేపీ కేంద్రాల ద్వారా 21,634.68 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ 129 కేంద్రాల ద్వారా 42,578.40 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ 90 కొనుగోలు కేంద్రాల ద్వారా 52,949.04 మెట్రిక్ టన్నులు, ఇలా మొత్తం 1,17,162.12 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 6,281 మంది రైతుల ఖాతాల్లో రూ. 98.53 కోట్లు జమ చేశారు.
గతంలో క్వింటాల్ వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్కు రూ. 2060, సాధారణ రకానికి రూ. 2040 చెల్లించగా, వానకాలం వడ్లకు రూ. 143 మద్దతు ధర పెంచారు. ప్రస్తుతం క్వింటాల్ ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ. 2203, సాధారణ రకానికి రూ. 2183 అందిస్తున్నారు. అది కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఆన్లైన్లో నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు.
వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుం డా గన్నీ బ్యాగులు, వాహనాలు అందుబాటులో ఉంచాం. ఏదైనా సమస్య మా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. ఆఖరు గింజ వరకూ కొనుగోళ్లు జరుపుతాం. – గెడం గోపాల్,
డీఎం, పౌరసరఫరాల సంస్థ, మంచిర్యాల