చెన్నూర్, ఫిబ్రవరి 8 : చెన్నూర్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లలో జాప్యమవుతున్నది. సీసీఐ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు పత్తిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల నుంచి నిత్యం వాహనాలు తరలివస్తుండగా, కొనుగోళ్లు చేపట్టకపోవడంతో టోకెన్లు తీసుకొని రెండు, మూడు రోజులు క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తున్నది. దీంతో రైతులపై వెయిటింగ్ ఛార్జీల భారం పడుతుంది.
సీసీఐ వారు కొనుగోలు చేసిన పత్తిని వరలక్ష్మీ, ఆదిశంకరాచార్య, చెన్నూర్ కాటన్, జీఆర్ఆర్ కాటన్ మిల్లుల్లో మిల్లింగ్ చేస్తున్నారు. మిల్లుల్లో పత్తిని నిల్వ చేసేందుకు స్థలం లేదనే కారణంతో సేకరణలో ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తారనే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కవ్వడం వల్లే సక్రమంగా పత్తిని కొనుగోలు చేయడం లేదని, ఇకనైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. కాగా, ప్రభుత్వం క్వింటాలుకు రూ 6,920 గిట్టు బాటు ధర కల్పించగా, ప్రైవేట్ వ్యాపారులు రూ. 6,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.