ఆదిలాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో తమ చిరకాల వాంఛ నేరవేరుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. 40 సంవత్సరాల తర్వాత ప్రధాని హోదాలో మోదీ జిల్లా పర్యటనకు వస్తున్నందున పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ ప్రజాప్రతినిధులు ఆశించారు. ప్రధాని కంటే ముందు ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఈ విషయంలో ప్రధాని సానుకూల ప్రకటన చేయాలని కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేలు సమస్యల గురించి చెబుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జిల్లా ప్రజాప్రతినిధులు స్వయంగా మోదీ సభలో ప్రస్తావిస్తున్నందున ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని జనం ఆశించారు. దాదాపు 25 నిమిషాలపాటు ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాము తెలియజేసిన అంశాలకు పరిష్కారం మార్గం చూపిస్తారని ఆశించినా చివరకు నిరాశే మిగిలింది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎ న్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. ప్రజలు కూడా వీటి పరిష్కారానికి చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్కు నిధులు కేటాయించాలని, మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించాలని, ఎయిర్పోర్టు నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని, ఉట్నూర్లో గిరిజన యూనివర్శిటీని మంజూరు చేయాలని, జిల్లా లో పత్తిసాగు చేస్తున్న రైతుల ఉపాధిని మెరుగుపర్చడానికి టైక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు, జిల్లావాసులు ఏళ్లుగా కోరుతున్నారు. ప్రధాని పర్యటన సం దర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వయంగా మోదీ ముందు ఎంపీ బాపురావ్ మాట్లాడుతూ ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్కు సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఆ దిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని,ఎయిర్పోర్టు విషయంలో చర్య లు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూ డా మాట్లాడుతూ.. ఆరు వేల మందికి ఉపాధి కల్పించే సి మెంట్ పరిశ్రమను ప్రారంభించాలని హామీ ఇవ్వాలని కో రారు. జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా ఉన్నందున టైక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాకు చెందిన ఇద్ద రు ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై మోదీ కనీ సం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మోదీ సభ ఎన్నికల సభగానే కొనసాగిందే తప్పా.. ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.