ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో నీలి విప్లవం కొనసాగుతుందని ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. మత్స్యకారులు అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందని అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలంలోని అడ ప్రాజెక్టులో ఆరో విడత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాల్రాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల వృత్తుల పరిరక్షణను ప్రభుత్వం ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేస్తున్నదన్నారు.
మత్స్యకారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక చేపట్టిన పథకాలతో నేడు పూర్వవైభవం సంతరించుకుంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆత్రం మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ వృత్తులను బలోపేతం చేయడం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్తవెలుగులు నింపుతున్నారని గుర్తుచేశారు.
కలెక్టర్ రాల్రాజ్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్యకారుల పథకం ద్వారా మూడు వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్, జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.