ఆసిఫాబాద్ టౌన్, జనవరి 31: జిల్లా వ్యాప్తంగా గురువారం(ఫిబ్రవరి 1) నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 23 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 12 సెంటర్లు జనరల్ విద్యార్థుల కోసం, 11 ఒకేషనల్ విద్యార్థుల కోసం కేటాయించారు.
మొత్తంగా 2816 మంది జనరల్ విద్యార్థులు, 1546 మంది ఒకేషనల్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జామినర్ల నియామకాలు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై ఆదేశాలిచ్చారు.
మంచిర్యాల అర్బన్, జనవరి 31 : జిల్లాలో మొదటి విడుత ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 7106 మంది ఫస్టియర్ విద్యార్థులు, 7031 సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఫిబ్రవరి 1 నుంచి మూడు విడుతల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేశాం. ఎలాంటి సమస్యలున్నా దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తాం.
-నైతం శంకర్, ఆసిఫాబాద్ జిల్లా మాధ్యమిక విద్యాధికారి