ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి. స్వరాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల్లోని పాఠశాలల్లో వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకం, ఇంగ్లిష్ చదువులు, పౌష్టికాహారం అందిస్తున్నది. దీంతో పాటు పాఠశాల చదువుల తర్వాత గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించడానికి పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసింది. గురుకుల కళాశాలలు, డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేసింది. జూనియర్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసే విధంగా ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి పరీక్షల్లో రాణించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఐదేళ్ల కిందట స్టార్స్ 50 కార్యక్రమాన్ని ఐటీడీఏ అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న వారితో పోటీ పడుతున్నారు. సర్కారు అందించిన సాయంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఐఐటీలు, ఎన్ఐటీలో సీట్లు సంపాదిస్తున్నారు.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్లో 2015-16లో స్టార్స్ 50 ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు శిక్షణ పొందిన విద్యార్థుల్లో 38 మంది ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందారు. మరో 27 మంది జేఎన్టీయూలో సీట్లు సంపాదించారు. స్టార్స్ 50 శిక్షణకు ఎంపికలో భాగంగా అధికారులు జిల్లాలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపీసీ చదువుతున్న విద్యార్థులను ఐఐటీ బ్యాచ్కు 40 మంది, బైపీసీ చదువుతున్న వారిని నీట్ బ్యాచ్కు 40 మందిని ఎంపిక చేస్తారు. శిక్షణ కేంద్రంలో వివిధ విభాగాల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అందజేస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు గురుకుల సొసైటీ నుంచి ల్యాప్టాప్ రూ.50 వేలు, ఎన్ఐటీలో సీట్ల వచ్చిన వారికి ల్యాప్టాప్ రూ.40 వేలు అందజేస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తాము ఉన్నత విద్య చదువుకునే అవకాశం లభించినట్లు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. నేరడిగొండ మండలం లఖంపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదివాను. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ గిరిజన జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ స్టార్స్ 50కి ఎంపికయ్యాను. ఇక్కడ ఐఐటీ బ్యాచ్లో శిక్షణ తీసుకుంటున్నా. పాఠాలు బాగా చెబుతున్నారు. నాకు మంచి కళాశాలలో సీటు వస్తుందనే నమ్మకం ఏర్పడింది.
– మడావి దీపిక, విద్యార్థిని, రాంపూర్, ఇచ్చోడ మండలం
మాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం శివనూరు. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తరు. స్టార్స్ 50 కేంద్రం ఏర్పాటుతో మాలాంటి వారికి ఉన్నత విద్య చదువుకునే అవకాశం లభించింది. ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి రెండేళ్ల పాటు మంచి శిక్షణ ఇస్తారు. రోజూ 10 గంటల పాటు చదువుకునేందుకు సమయం కేటాయిస్తాం. అధ్యాపకులు చదువులో మంచి మెళకువలు నేర్పిస్తారు. స్టార్స్ 50 శిక్షణతోనే నేను ఎన్ఐటీ లో సీటు సాధించా.
-రాథోడ్ సువర్ణ, బీటెక్, ఈఈ, ఎన్ఐటీ, అరుణాచల్ ప్రదేశ్
మాది నిర్మల్ జిల్లా ఖానాపూర్. సుర్జాపూర్ జడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివిన. ఇచ్చోడ గిరిజన గురుకుల కళాశాలలో చదువుకుంటూ ప్రవేశ పరీక్ష ద్వారా స్టార్స్ 50కి ఎంపికయ్యాను. శిక్షణ కేంద్రంలో అనుభవం కలిగిన మంచి అధ్యాపకులు ఉన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన స్టార్స్ 50 శిక్షణ కేంద్రంతో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాల్లో పేద గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసినట్లవుతున్నది. ఇక్కడ తీసుకున్న శిక్షణతోనే నాకు తిరుచ్చి ట్రిఫుల్ ఐటీలో సీటు వచ్చింది. బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగం సాధిస్తా.
– ఎం. ప్రవీణ్, ట్రిఫుల్ ఐటీ, తిరుచ్చి, తమిళనాడు
మాది మంచిర్యాల. నేను ఇచ్చోడ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ స్టార్స్ 50లో శిక్షణ పొందుతున్నా. ఇక్కడ శిక్షణ బాగుంది. రెగ్యులర్ పాఠాలతో పాటు ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. ఈ శిక్షణ కారణంగా నాకు ఐఐటీలో సీటు వస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సు తీసుకొని మంచి ఉద్యోగం సాధిస్తా.
– పృధ్వీరాజ్నాయక్, విద్యార్థి, మంచిర్యాల..
మాది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సావర్గాం. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. లఖంపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నా. ఇచ్చోడ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో చదువుకుంటూ స్టార్ 50 శిక్షణకు ఎంపికయ్యాను. శిక్షణ కేంద్రంలో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా బోధిస్తారు. చదువు, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. మాలాంటి పేద విద్యార్థులకు స్టార్స్ 50 శిక్షణ ద్వారా ఉన్నత విద్య చదువుకునేందుకు అవకాశం కలుగుతున్నది.
– జే. లావణ్య, బీటెక్, ఈఈఈ, ఎన్ఐటీ, అరుణాచల్ ప్రదేశ్
స్టార్స్ 50 శిక్షణ కేంద్రంలో ఎంపికైన విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తాం. రెగ్యులర్ క్లాసులతో పాటు స్టడీ అవర్స్ నిర్వహిస్తాం. ప్రాక్టికల్స్ చేయిస్తాం. రెండు సంవత్సరాల శిక్షణ కాలంలో విద్యార్థులు ఐఐటీ,ఎన్ఐటీ,ట్రిఫుల్ ఐటీతో పాటు జేఎన్టీయూల్లో ప్రవేశాలు పొందేలా తీర్చిదిద్దుతాం. అనుభవం కలిగిన అధ్యాపకులు చేత శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థుల చదువుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి రోజూ రెండు గంటలు స్టడీ అవర్స్ నిర్వహించి సందేహాలను నివృత్తి చేస్తాం. వివిధ రకాల స్టడీ మెటీరియల్ అందజేస్తాం.
– ఎం. మారుతి శర్మ, కో ఆర్డినేటర్, స్టార్స్ 50, ఆదిలాబాద్