దస్తురాబాద్, ఆగస్టు 7 : రానున్న ఎన్నికల నేపథ్యంలో దస్తురాబాద్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తహసీల్దార్ ఎండీ జాకీర్కు సూచించారు. తహసీల్ కార్యాయలంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రం నుంచి అధికారులతో కలెక్టర్ వరుణ్ రెడ్డి వీసీ నిర్వహించారు. గుర్తించిన పోలింగ్ స్టేషన్లను సందర్శించి, వాటిని పరిశీలించి, వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు గుర్తించాలని సూచించారు. ధరణిలో పెండింగ్లో ఉన్న వాటి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయేతర భూములను నాలా రిజిస్ట్రేషన్ చేసేకునేందుకు పర్మిషన్ వచ్చిందని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే వీఆర్ఏలు ఎంత మంది ఉన్నారు.., 60 ఏండ్లు నిండిన వారు.., నిండని వారు ఎందరున్నారు అనే వివరాలను సేకరించాలన్నారు. హరితహారం, డ్రై డే కార్యక్రమాలు, పారిశుధ్య పనులను గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కండ్ల కలకపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కండ్ల కలక వస్తే వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ఆర్ఐలు గంగన్న, పీ వెంకట సర్సయ్య, వెటర్నరీ అసిస్టెంట్ దేవిదాసు, జూనియర్ అసిస్టెంట్ సూరజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీలను సత్వరం పరిష్కరించాలి..
ప్రజా ఫిర్యాదుల వి భాగంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించి ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందించి, వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. 28 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.