శ్రీరాంపూర్, సెప్టెంబర్ 27: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు పూర్తి వివరాలను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం రామగుండం సీపీ రెమా రాజేశ్వరి(డీఐజీ) వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రాపరి గ్రామానికి చెందిన డ్రైవర్ జగబంధు క్రిసాని(22), చిత్రాసేన్ క్రిసాని(23) ట్రాక్టర్లో ఈ నెల 23న గంజాయిని తీసుకొస్తున్నారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ సమీప జాతీయ రహదారి వద్ద ట్రాక్టర్ టైర్ పంచర్ అయ్యింది.
దీంతో ట్రాక్టర్ ను వదిలి పారిపోయారు. శ్రీరాంపూర్ ఎస్ఐ రాజేశ్, సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా సిమెంట్ ఇటుకల లోడ్తో, నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న ట్రాక్టర్ను గుర్తించారు. ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేయడానికి, సేఫ్ కస్టడీ కోసం ట్రాక్టర్ను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నెల 25 వరకు ఎవరూ రాకపోవడంతో, పోలీసులు ట్రాక్టర్ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఇటుకల కింది భాగంలో 93 బ్రౌన్ కలర్ టేపు చుట్టి ఉన్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. తర్వాత గెజిటెడ్ అధికారి సమక్షంలో ఎస్ఐ రాజేశ్ పంచనామా నిర్వహిండంతో అందులో 465 కిలోల గంజాయిని గుర్తించారు.
దీని విలువ సుమారు. రూ. 93 లక్షల వరకు ఉంటుంది. ట్రాక్టర్లో దొరికిన పలు పత్రాల ఆధారంగా ఒడిశా రాష్ర్టానికి చెందిన నిందితులను గుర్తించినట్లు చెప్పారు. వెంటనే రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్, శ్రీరాంపూర్ సర్కిల్ పోలీసులు ప్రత్యేక బందాలుగా ఏర్పడి, నిందుతుల కోసం ఒడిశాకు వెళ్లినట్లు తెలిపారు. ట్రాక్టర్ యజమాని చిత్రసేన్ క్రిసాని, అతని సోదరుడు జగబంధులను అనుమానితులుగా అరెస్ట్ చేసి విచారణ చేయగా, సాంకేతిక ఆధారాలతో వారే నిందితులుగా గుర్తించామన్నారు. నిందితులు కూడా నేరం చేసినట్లు అంగీకరించారని తెలిపారు. ఈశ్వర్, గురు క్రిసాని సూచనల మేరకు మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ ప్రాంతంలో సాగుదారుల నుంచి గంజాయిని సేకరించినట్లు నేరాన్ని ఒప్పకున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 21న ఈశ్వర్, గురులకు ట్రాక్టర్ మహారాష్ట్రకు వెళ్లాలని అడగడంతో ఇచ్చారని చెప్పారు. ఈ క్రమంలో శ్రీరాంపూర్ వద్ద ట్రాక్టర్ పంక్చర్ కావడంతో పరారయ్యారు. ట్రాక్టర్ యజమాని చిత్రసేన్ క్రిసాని, డ్రైవర్ జగబంధును అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపించామని తెలిపారు. ఈశ్వర్, గురుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. రామగుండం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్, శ్రీరాంపూర్ సీఐ రమేశ్బాబు, ఎస్ఐ రాజేశ్, ప్రసాద్, జైపూర్ ఎస్ఐ ఉసేందర్, భీమారం ఎస్ఐ రాజవర్దన్, టాస్క్ఫోర్స్ పోలీసులు మల్లేశం, సత్తయ్యలను అభినందించారు. గంజాయి, ట్రాక్టర్, 2 సెల్ ఫోన్లు, నిందితుల అరెస్ట్ చూపించారు. డీసీపీ సుధీర్ రామ్నాధ్ కేకేన్, జైపూర్ ఏసీపీ మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.