మంచిర్యాల అర్బన్ : శాంతి భద్రతల ( Peace and Security ) విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఆంబర్ కిషోర్ ఝా ( Amber Kishore Jha ) పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షలో భాగంగా రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ గురువారం కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా, పెండింగ్, ప్రస్తుత కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలని సూచించారు. మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.
బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని, శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఏం రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.