కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఓటర్లు 100 శాతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు, పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కలెక్టర్ వెంకటేశ్దోత్రే, ఎస్పీ సురేశ్కుమార్ నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో గుర్తించిన 47 సమస్యాత్మక కేంద్రాలతో పాటు 22 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. నెట్వర్క్ లేని పోలింగ్ కేంద్రాలు గతంలో 39 ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 56కు చేరింది. పోలింగ్ రోజున ఆయాచోట్ల ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మే 13న జరుగునున్న పార్లమెంట్ ఎన్నిలకు అధికారులు సంసిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 4,55,437 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 597 పోలింగ్ కేంద్రాలుండగా, ఓటర్ల సంఖ్యను బట్టి 676 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగి తమ సొంత జిల్లాలో లేదా నియోజకవర్గంలో ఓటు వేసే అవకాశం కల్పించారు. పోస్టల్ ఉద్యోగులు మే 3 నుంచి 8వ తేదీవరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వెంటనే ఫిర్యాదులు చేసేందుకు 1950తో పాటు 0873327 9033 నంబర్లను అందుబాటులో ఉంచారు. ఇక పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ నగదుతో పాటు మద్యం, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికలు ప్ర శాంతంగా నిర్వహించేందుకు గ్రామాల్లో పెద్ద ఎత్తున సీఆర్పీఫ్ బలగాలతో ఫ్లాగ్మార్చ్లు నిర్వహిస్తున్నారు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.