మంచిర్యాల ఏసీసీ, మార్చి 27: చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని, బాధ్యతగా మెలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ బుధవారం డీసీపీ అశోక్ కుమార్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో 218 మంది రౌడీషీటర్లు ఉన్నారని తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు, సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం విచారణ జరుగుతున్నదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
నేరం చేసే ముందు, కుటుంబాలు, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉకుపాదం మోపుతామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే, రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. రౌడీ షీటర్ల నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేశ్ కుమార్, ఎస్ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.