సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని మోదీ, బొగ్గు బ్లాకులను ఆ సంస్థకు ఎందుకు అప్పగించడం లేదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రశ్నించారు. మోదీ పర్యటన తీరుపై మంచిర్యాలలో ఆదివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. కార్మికుల ఐటీ, పింఛన్ సమస్యలపై ఒక్క మాట మాట్లాడకుండా దాటేశారని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిన ఘనత ఆయనకే దక్కిందని, ఇప్పుడు కూడా ప్రైవేటీకరణపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై ఏనాడూ మాట్లాడరని, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో దృష్టి మరల్చేందుకే తెలంగాణలో పర్యటించారని స్పష్టం చేశారు.
మంచిర్యాలటౌన్, నవంబర్ 13: సింగరేణిని ప్రైవేటీకరించబోమని మోదీ పచ్చి అబద్ధం చెప్పాడని, అలాగైతే బొగ్గుబ్లాకుల వేలాన్ని సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో మాట్లాడిన మాటలన్నీ అబద్దాలేనని, ఆయన తెలంగాణ రాష్ట్రంపై విద్వేషాన్ని పెంచుకుని మాట్లాడారని విమర్శించారు. ఆదివారం మంచిర్యాలలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి పర్యటన అంటే ఆరు నెలల ముందుగా ఖరారవుతుందని, ఆగమేఘాలమీద పర్యటన చేయడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆడియో, వీడియో టేపులను దేశ ప్రజలంతా చూశారని, పట్టుబడిన బీజేపీ దొంగలు చంచల్గూడ జైలులో ఉన్నారని ఆరోపించారు. ఈ అంశంనుంచి ప్రజల దృష్టి మరల్చడానికే తెలంగాణలో పర్యటించి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. ఆ మాటలను ఇక్కడి ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఎద్దేవా చేశారు.
రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీనుంచి ఏడాదికాలంగా యూరియా ఉత్పత్తి అవుతుందని, దానిని జాతీయం చేసేందుకు వచ్చారని, పనిలో పనిగా రైల్వేలైన్, రోడ్డు పనులను ప్రారంభించారని, నిజానికి అవి ఎప్పుడో పూర్తయ్యాయని తెలిపారు. మోదీ వస్తే తెలంగాణకు ఏమైనా వరాలు ఇస్తారని ఎదురుచూసిన ప్రజలకు ఏమీ ఇవ్వక పోగా అన్నీ అబద్దాలే మాట్లాడటంపై విసిగిపోతున్నారని చెప్పారు. గుజరాత్లో ఎన్నికలు వస్తున్న సందర్భంగా రూ.1.35 లక్షల కోట్లతో ప్రాజెక్టులు మంజూరు చేశారని, ఇక్కడ కూడా వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయని, అయినా ఎలాంటి ప్రకటనలు చేయకపోవడాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. గుజరాత్లో మోంజీ వంతెన కూలిపోయి 140 మంది మృతిచెందారని, గడియారాలు తయారుచేసే కంపెనీకి వంతెన మరమ్మతుల పనులు అప్పగించారని తెలిపారు.
అవినీతిపై మాట్లాడిన మోదీ కర్ణాటకలో 40 శాతం, మధ్యప్రదేశ్లో కమిషన్లు ఇచ్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని మరిచారా ? అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి రాక ముందు మోదీ మిత్రుడు ఆదాని ఆస్తి ఎంత ? ఈ ఎనిమిదేళ్లలో ఆస్తి ఎంతో అందరూ గుర్తించారని ప్రస్తావించారు. కార్పొరేట్ గద్దలకు రూ.16వేలకోట్లు మాఫీచేశారని, నల్లధనం వెనక్కి తెస్తానని చెప్పారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ప్రతి వ్యక్తీ బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తానని చెప్పి ఒక్కటీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఇవన్నీ కాక లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా మోదీ పాలన సాగిస్తున్నారని, ముఖ్యంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణను అణగదొక్కాలన్న ఉద్దేశంతో ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులకు జాతీయహోదా, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీలను ఇవ్వకుండా రాష్ర్టానికి నష్టం చేస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో మూఢనమ్మకాలను నమ్ముతారని మోదీ వ్యాఖ్యానించడాన్ని సుమన్ తీవ్రంగా తప్పుపట్టారు.
మూఢనమ్మకాలకు, మనిషి విశ్వాసాలకు తేడా తెలియని అజ్ఞాని మన ప్రధాని అవడం దురదృష్టమని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని బొగ్గుబ్లాకులను సింగరేణికే కేటాయిస్తామని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికుల పింఛన్ను పెంచాలని డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీని ప్రజలు బొందపెట్టారని, ఆ విషయాన్ని జీర్ణించుకలేక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాలను తుంగలో తొక్కారని, ఏడు మండలాలను ఆంధ్రలో కలిపారని, ఆంధ్రలోని విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టారని, తెలంగాణ ప్రజలతోపాటు దేశ ప్రజలందరిపైనా మోదీ భారం మోపారని అన్నారు. నిత్యావసరాల ధరలు పెంచి నడ్డివిరుస్తున్నారని, పెట్రోల్, గ్యాస్ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.
రైతులపై మోదీ మొసలి కన్నీరు కార్చారని, రైతుల ధాన్యాన్ని కొనకుండా అడ్డుపడుతున్నది ఎవరో చెప్పాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీజేపీ, మోదీ కుట్రలన్నీ తెలంగాణ ప్రజానీకం గుర్తించారని, ఆయన అబద్దాల మాటలను, ప్రకటనలను నమ్మేస్థితిలో లేరన్న విషయాన్ని గుర్తెరుగాలని అన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మున్సిపల్ వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, టీబీజీకేఎస్ నాయకులు జే సంపత్, సురేందర్రెడ్డి, కౌన్సిలర్ గాదెసత్యం, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు గరిగంటి సరోజ, తదితరులున్నారు.