కుమ్రం భీం ప్రాజెక్టు మిషన్ ‘భగీరథ’కు వరంగా మారింది. ఈ పథకానికి యేటా 1.77 టీఎంసీలు వినియోగిస్తుండగా, ప్రతి రోజూ 918 గ్రామాలకు 90 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల్లో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదుకాగా, ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని యంత్రాంగం చెబుతున్నది. జలాశయంలో పుష్కలంగా నీరుందని, రెండేళ్లదాకా శుద్ధజలానికి ఇబ్బంది లేదని భరోసానిస్తున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ)
జిల్లా కేంద్రం సమీపంలోని కుమ్రం భీం(అడ) ప్రాజెక్టు.. మిషన్ భగీరథ పథకానికి వరంగా మారింది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సర్కారు చర్యలు చేపడుతున్నది. కుమ్రం భీం ప్రాజెక్టు సామర్థ్యం 237.6 (10 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 234.15 అడుగుల నీ రు ఉంది. యేటా మిషన్ భగీరథ కోసం 1.77 టీ ఎంసీల నీరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు నుంచి ప్రతి రోజూ జిల్లాలో ని 918 గ్రామాలకు 90 ఎంఎల్డీ (మిలియన్ లీ టర్స్ ఫర్ డే) నీరు సరఫరా అవుతోంది. దీంతో పా టు కాగజ్నగర్, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పుష్కలంగా నీటి నిల్వలు ఉండడంతో తాగునీటికి ఎలాంటి ఇబ్బందుల్లేవని మిషన్ భగీరథ అధికారులు అంటున్నా రు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు కలగకుండా నిత్యం నీటిని సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.
14 మండలాల్లో వర్షాభావం
జిల్లాలోని 15 మండలాల్లో ఒక్క లింగాపూర్ మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.మిగతా 14 మండలాల్లో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్, కౌటల మండలాల్లో ఈ రోజు వరుకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో జూన్, జూలై నెలల్లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 241.0 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 133.8 మిల్లీ మీటర్లు మాత్రమ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 45 శాతం లోటు వర్షపాతం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలతో దాదాపు రెండేళ్ల వరకు ఢోకా లేదని, వర్షాభావ పరిస్థితులు మరీ తీవ్రమైతే కనీసం ఏడాదిన్నర (18 నెలలు) పాటు నీటిని సరఫరా చేయగలమని అధికారులు తెలిపారు.
మిషన్భగీరథ నీటికి ఇబ్బంది లేదు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటికి ఎలాంటి ఇబ్బందుల్లేవు. కుమ్రం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మెయిన్ గ్రిడ్ ద్వారా నిత్యం 918 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నాము. ప్రతిరోజూ 90 మిలియన్ లీటర్ల నీటిని పంపిస్తున్నాం. ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథకు 1.77 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 234.6 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. రెండేళ్ల వరకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇంకా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే కనీసం 18 నెలల పాటు నీటిని అందించవచ్చు.
– వెంకటపతి, మిషన్ భగీరథ ఈఈ