రాష్ట్రం ఆవిర్భవించడం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం వల్ల తెలంగాణవాసులు సుభిక్షంగా ఉన్నారు. పదేండ్లలో పల్లె, పట్టణ రూపురేఖలు మారిపోయాయి. రైతులు, సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ వెన్నంటి ఉన్నారని గ్రహించిన కాంగ్రెసోళ్లు.. అసెంబ్లీ ఎన్నికల వేళ విచక్షణ రహితంగా విషాన్ని చిమ్ముతున్నారు. 24 గంటల ఉచిత కరెంటుకు బదులు మూడు గంటలిస్తామని, 3,5 హెచ్పీ మోటర్లకు బదులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని, రైతుబంధు దుబారా అని, ధరణి పోర్టల్ను ఎత్తేసి భూమాత తీసుకొస్తామని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్కు అవకాశం ఇస్తే వ్యవస్థలన్నీ కుప్పకూలి పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు నీళ్లు, కరెంట్ లేక భూములకు ధరలు ఉండేవి కావు. బీఆర్ఎస్ అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రధాన రహదారుల వెంట ఎకరాకు రూ.3 కోట్ల వరకు ఉండగా.. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరాకు రూ.50 లక్షలు పలుకుతోంది. ఇప్పుడు తప్పిదారిన కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మళ్లీ మునుపటి పరిస్థితులు పునరావృతం కాకతప్పదనే చర్చ జరుగుతోంది. ధరణి వ్యవస్థను ఎత్తేస్తే రైతుల చేతిలో ఉన్న భూములు అధికారుల చేతిలోకి వెళ్తాయి.
రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, ఎరువులు, విత్తనాలకు ఆగం అవుతాము. సాగు విస్తీర్ణం పడిపోయి, దిగుబడి తగ్గుతుంది. ఇంకా, ప్రతి ఆరు నెలలకోసారి పహాణీ, మరేదైనా సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పదేండ్లు కష్టపడి నిర్మించుకున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి కుప్పకూలి పోతుంది. గతంలో మాదిరిగా గ్రామీణ ప్రాంత యువత వలసలు వెళ్లే పరిస్థితులు వస్తాయనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
– మంచిర్యాల, నవంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కోటపల్లి, నవంబర్ 27 : కాంగ్రెస్ పార్టీ రైతులపై పగబట్టింది. ఎవుసాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నది. రైతు వ్యతి రేఖ విధానాలకు తెరలేపుతున్నది. సీఎం కేసీఆర్ సారు 24 గంట లు ఉచిత కరెంటిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే.. మూడు గంటల కరెంటిస్తామని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకో వాలని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకోవాలని చూస్తున్నది. ఎప్పటి మాదిరిగానే రైతుబంధు వేయాలని బీఆర్ఎస్ సర్కారు చూస్తుంటే.. వేయకుండా అడ్డుపుల్లలు వేస్తున్నది. రావాల్సిన డబ్బులు కూడా రాకుండా చేసింది.
మంచిగా ఉన్న ధరణిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించింది. ఒకరి భూములు ఒకరికి మారుతయ్. దీంతో పల్లెల్లో భూ తగాదాలు, ఘర్షణలు మళ్లీ మొదలైతయ్. పచ్చని పల్లెలు కల్లోల ప్రాంతాలుగా మారే చాన్స్ ఉంది. రైతుబంధు కూడా భూమి యజమానికి ఇస్తే కౌలు రైతుకు ఇవ్వమని, కౌలు రైతుకిస్తే భూ యజమానికి ఇవ్వమని మోసపూరిత మాటలు చెబుతున్నారు. మేము కాంగ్రెస్కు మద్దతిచ్చి కోరి కష్టాలు తెచ్చుకోం. రైతు పక్షపాతి కేసీఆర్కే మద్దతు తెలుపుతం.
– గుర్రం రాజన్న, రాపనపల్లి, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా.