కోటపల్లి, జూలై 23 : దివ్యాంగులపై తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్ మరోమారు చాటుకున్నారు. వికలాంగుల గోసను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారు ఎవరికీ భారం కాకూడదనే సదుద్దేశంతో పింఛన్ను పెంచాలని సంకల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రూ.500 ఉన్న పింఛన్ను రూ.1500 చేశాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ అయింది. ప్రస్తుతం ఒక్కో వికలాంగుడికి నెలకు రూ.3.016 చొప్పున వస్తుండగా.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల సభలో అదనంగా రూ.1000 పెంచుతున్నట్లు ప్రకటించారు. తాజాగా వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా.. రూ.4,016 అందుకోనుం డడంతో దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
దివ్యాంగులకు పింఛన్ పెంచుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరింది. దివ్యాంగులకు నెలనెలా అందుతున్న రూ.3,016కు అదనంగా రూ.1,000 పెంచుతూ జూన్ 9న మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించగా, ప్రకటన వెలువడి రెండు నెలలు గడవక ముందే దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారి కాళ్ల మీద వారే నిలబడే విధంగా ఉండడానికి రూ.1,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అడగకుండానే దివ్యాంగులకు రూ.4,016 ఇస్తామన్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై దివ్యాంగులు సంబురాలు చేసుకుంటున్నారు.
దివ్యాంగులకు ప్రతినెలా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా రూ.3,016 ఇస్తున్నది. ఈ డబ్బులతో వాళ్ల పాటికి వాళ్లు బతుకుతున్నరు. ఇయ్యాల మంచి దినం. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నయ్. ఈ సందర్భంలో దివ్యాంగుల పింఛన్ మరో రూ.1000 పెంచుతున్నట్లు మనవి చేస్తున్నా. మంచిర్యాల గడ్డ నుంచి, తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ఈ మాట ప్రకటించాలని సస్పెన్స్లో పెట్టిన. వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ.4,016 వస్తాయని మనవి చేస్తున్నా.
రూ.500 నుంచి 4,016 వరకు..
దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ను రూ.500 నుంచి రూ.4,016కు పెంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగక ముందు దివ్యాంగులకు ప్రతి నెలా రూ.500 పింఛన్ అందించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పింఛన్ను రెట్టింపు చేస్తూ రూ.1,500 చేశారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆ పింఛన్ను రూ.3,016 పెంచి దివ్యాంగుల సంక్షేమంపై కేసీఆర్కు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. తాజాగా దివ్యాంగులు అడగకముందే వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి పింఛన్ను మరో రూ.1000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చెల్లించనున్న రూ.4,016 పింఛన్పై దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వెలువడుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్.. మంచిర్యాల జిల్లా నస్పూర్ సీసీసీలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు అప్పారావు, ముత్యాల లక్షణ్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, దివ్యాంగులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
36,489 మందికి లబ్ధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 36,489 మంది దివ్యాంగులకు రూ.14.64 కోట్ల ప్రయోజనం చేకూరనుంది. ఇందులో మంచిర్యాల జిల్లాలో 12,677 మందికి రూ.5.09 కోట్లు, నిర్మల్లో 10,584 మందికి రూ.4.25 కోట్లు, ఆదిలాబాద్లో 7,178 మందికి రూ.2.88 కోట్లు, ఆసిఫాబాద్లో 6,050 మందికి రూ.2.42 కోట్లు అందించనున్నారు.
ఇగ మాకు రూ. 8,032 వస్తయ్..
దస్తురాబాద్, జూలై 23 : నా పేరు గాగిరెడ్డి స్వప్న. భర్త అంజిరెడ్డి. మాది దస్తురాబాద్. నాకు పోలియో. మా ఆయనకు మాటలు రావు. మాకు ఇద్దరు కొడుకులు. మాది నిరుపేద కుటుంబం. బతుకుడెట్లనోనని మస్తు రందిపడేటోళ్లం. తెలంగాణ వచ్చినంక మా బతుకులకు భరోసా వచ్చింది. ఇప్పటి దాకా మా బ్యాంకు ఖాతాల్లో రూ. 6,032 పడ్డయ్. ఇప్పుడు పెరిగిన పైసలతో కలిపి రూ. 8,032 వస్తయ్. గీ డబ్బులతోనే మా ఇల్లు గడుస్తది. ఎవ్వరికీ చేయి చాపకుండా గీయింత మంచిగ బతుకుతున్నమంటే సీఎం కేసీఆర్ సార్ దయవల్లే. గాయనే మాకు దేవుడు.
బతికున్నంత కాలం తలుసుకుంటం
కోటపల్లి, జూలై 23 : మా అమ్మానాన్నలకు నలుగురం ఆడపిల్లలం. నేనే పెద్దదాన్ని. చిన్నప్పుడే పోలియో వచ్చి కాలు పన్జేయకుంట అయింది. కుట్టు మిషిన్ నేర్చుకున్న. తెలంగాణ రాకముందు నాకు రూ.500 పింఛన్ వచ్చేది. గా పైసలు కూడా ఎప్పుడోసారి వచ్చేవి. కుటుంబం గడవడం మస్తు తిప్పలయ్యేది. ఇగ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పింఛన్ పెంచి భరోసానిచ్చిన్రు. మొదట రూ.1500… ఆ తర్వాత రూ.3016కు పెంచిండు. ఇప్పుడు మళ్లా రూ. 4,016 చేసి ఆత్మ గౌరవంతో బతికేలా చేసిండు. ఏడాది కింద నాకు పెళ్లయ్యింది. కల్యాణ లక్ష్మి కింద రూ.లక్షా నూట పదహార్లు వచ్చినయ్. దేశంలోనే ఇసొంటి సీఎంను ఎవ్వరూ చూసిండరు. పేదోళ్లకోసం మంచి పనులు చేసేది ఒక్క కేసీఆర్ సారే. బతికున్నంత కాలం ఆయనను తలుసుకుంటం.
– సునత్కారి సుమతి, మల్లంపేట
గిసొంటి సీఎంను సూడలే..
జైనూర్, జూలై 23 : నాకు పదిహేనేళ్లుగా పింఛన్ వస్తంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 500లే ఇచ్చేటోళ్లు. అవ్వి ఎటూ సరిపోక పోతుండే. ఆ ఇచ్చే కొన్ని పైసలు కూడా టైమ్కి ఇచ్చేటోళ్లు కాదు. ఆఫీసుల సుట్టూ తిరిగేటోళ్లం. మస్తు తిప్పలయ్యేది. ఇగ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ మా బతుకులకు భరోసానిచ్చిండు. పింఛన్ను రూ. 3016కు పెంచిండు. ఇప్పుడు మళ్లా రూ. 4016 ఇస్తమని చెప్పిన్రు. మాలాంటోళ్లకు సీఎం కేసీఆర్ దేవునోలె అయ్యిండు. గిసొంటి ముఖ్యమంత్రిని సూడలేదు. జీవితాంతం గాయనకు రుణపడి ఉంట.
– శేఖ్ మాజీద్, జంగాం, దివ్యాంగుడు
ఆత్మగౌరవంతో బతికేలా..
జైనూర్, జూలై 23 : మాది నిరుపేద కుటుంబం. చిన్నతనం నుంచే కాళ్లు పనిచేయడం లేదు. ఏ పని చేయలేను. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చినం. ఏ అవసరమొచ్చినా ఇంట్లో వాళ్లను డబ్బులు అడగాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మాలాంటోళ్ల బతుకులకు ఆసరా దొరికింది. మొన్నటి దాకా రూ. 3016 పింఛన్ వచ్చింది. ఇప్పుడు రూ. 4016కు పెంచిన్రు. గా డబ్బులతో ఇల్లు గడుస్తది. సీఎం కేసీఆర్ లేకుంటే మా బతుకులు ఆగమయ్యేది. ఆత్మగౌరవంతో బతికేలా భరోసానిచ్చిన మన ముఖ్యమంత్రివెంటే ఉంటాం.
– కాంబ్లే అంకుష్, ఆశపెల్లి, దివ్యాంగుడు
దివ్యాంగులకు గౌరవం ఇచ్చింది కేసీఆరే
నిర్మల్ టౌన్, జూలై 21 : కాంగ్రెస్ ఉన్నప్పుడు రూ. 500 పింఛనే వచ్చేది. జరమో.. నొప్పో వచ్చి దవాఖానకు పోతే బస్ కిరాయిలకు కూడా సరిపోయేటివి కావు. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ మొదట రూ. 1500.. ఆ తర్వాత రూ. 3016.. ఇప్పుడు రూ. 4016కు పెంచిండు. ఇటీవల మంచిర్యాల సభలో పింఛన్ పైసలు పెంచుతున్నట్లు చెప్పిండు. మస్తు సంబురమనిపించింది. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన సీఎం కేసీఆర్ సార్ను జీవితాంతం మరిచిపోం.
– మహ్మద్ అబీబ్, ఓల, కుంటాల మండలం
పింఛనే ఆధారం
నిర్మల్ టౌన్, జూలై 21 : నాపేరు సాయికష్ణ. మా ఊరు ఓల. అమ్మానాన్న వ్యవసాయం చేస్తరు. నాకు చిన్నప్పుడే కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేని స్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేసిన్రు. మొదట రూ.1500 ఇచ్చిన్రు. ఆ తర్వాత రూ.3016కు పెంచిన్రు. ఇప్పుడు మళ్లా రూ.4016 చేసిన్రు. గీ పింఛన్ మీదనే ఆధారపడి బతుకుతున్న. ఇది వరకు నాకు మూడు చక్రాల వాహనం కూడా ఇచ్చిన్రు. బతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటం.
– నాలం సాయికృష్ణ