దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ్చారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో తరలిరాగా, దారిపొడవునా ‘జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. కళాకారులు ఆటాపాటలతో అలరించగా, రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు వారితో కలిసి స్టెప్పులేశారు. వేదికల్లో సహపంక్తి భోజనాలు, ఉత్తమ రైతులకు సన్మానాలు చేశారు. నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కల్లూర్, రేవోజిపేట, మావల, బోథ్లలో స్థానిక ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్, జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో శనివారం రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 101 వ్యవసాయ క్లస్టర్లలో వేడుకలు అంబరాన్నంటాయి. అన్నదాతలు నృత్యాలు చేస్తూ ఎండ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహల్రాజ్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పాల్గొన్నారు. ఎడ్లబండి ర్యాలీలో పాల్గొన్నారు. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలం కజ్జర్లలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలో నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి హాజరయ్యారు. మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజర్ రెడ్డి సందేశాన్ని వ్యవసాయశాఖ అధికారులు చదివి వినిపించారు. రైతులు, ఎడ్లబండ్లు అందంగా అలకరించిన వారిని అధికారులు సన్మానించారు. రైతువేదికల్లో అన్నదాతలకు భోజనం ఏర్పాటు చేశారు.
తొమ్మిదేండ్లుగా వ్యవసాయ రంగానికి ప్రభు త్వం అండగా నిలుస్తుండడంతో, వ్యవసాయం పండుగలా మారిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావలలో జరిగిన రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. 24 గంటల ఉచిత విద్యుత్తో అన్నదాతలు రెండు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్నదని వివరించారు. ధరణి పోర్టల్, రైతుబీమా ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచాయని గుర్తు చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో జిల్లాలో వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 101 వ్యవసా య క్లస్టర్లలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2014లో 4.88 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, ఇప్పుడు 7.33 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 1.47 లక్షల మంది రైతులకు రైతుబంధు వర్తిస్తున్నదని, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 6,600 మంది రైతులకు రూ.27 కోట్లతో పనిముట్ల పంపిణీ చేశామన్నారు. రైతులకు రూ. 85 కోట్ల పంట నష్టపరిహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, జడ్పీటీసీ వనిత, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, ఏవోలు శివకుమార్, రమేశ్, బీఆర్ఎస్ నాయకులు నల్లా రాజేశ్వర్, రాజన్న, పవన్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలోనూ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి రైతు వేదిక వద్ద నిర్మహించిన కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తున్నదన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరంట్, యంత్రీకరణకు ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రిని దేశ ప్రజలందరూ మెచ్చుకుంటున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధు సమితి కమిటీ జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుంటాలలోని రైతు వేదికలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేటలో ఎమ్మెల్యే రేఖానాయక్, ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి , పెంబిలో కలెక్టర్ వరుణ్రెడ్డి, భైంసా మండలంలో అదనపు కలెక్టర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.