పల్లె ప్రగతితో విప్లవాత్మక మార్పు
ఉద్యమంలా సాగిన కార్యక్రమాలు
మారిన గ్రామాల రూపురేఖలు
ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతివనాలు
సుందరంగా, పరిశుభ్రంగా పల్లెలు
తలతలా మెరుస్తున్న రహదారులు
కాంతులీనుతున్న కూడళ్లు
సంపద సృష్టిస్తున్న సెగ్రిగేషన్ షెడ్లు
వైకుంఠధామాలతో సామాజిక మార్పు
ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లతో ఆదాయం
మొదటి విడుత పల్లె ప్రగతి 2019 సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు నెల రోజుల పాటు కొనసాగింది.
పట్టణ ప్రగతి 2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు చేశారు.
ఇప్పటివరకు నాలుగు విడుతలుగా పల్లె, మూడు విడుతలుగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రస్తుతం 20 నుంచి జూన్ 5 వరకు కార్యక్రమం కొనసాగనుంది.
మన పల్లెలు బృందావనాలను తలపిస్తున్నాయి.పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. ఉద్యమంలా నిర్వహించడంతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. రహదారులు తలతలా మెరుస్తున్నాయి. హరితాహారంతో భాగంగా నాటిన మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్లు కాంతులీనుతున్నాయి. మురుగు కాలువలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. పాడుబడ్డ బావులు పూడ్చబడ్డాయి. శిథిల భవనాల స్థానంలో కొత్త భవంతులు వెలిశాయి. ట్రాక్టర్, ట్రాలీలు చెత్తను ఏరివేస్తూ సంపదను సృష్టిస్తున్నాయి. దోమలు, ఈగలు, రోగాలు కానరావడం లేదు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ భవనాలు, రైతువేదికలు ప్రయోజనకరంగా మారాయి. పల్లెలు హరిత శోభితాన్ని సంతరించుకొని ముచ్చగొల్పుతున్నాయి. ఈనెల 20 నుంచి జూన్ 5 వరకు మరోసారి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తుండడంతో ప్రత్యేక కథనం..
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చెత్త అక్కడే అన్నట్లుగా ఉన్న పల్లెలు అభివృద్ధి పనుల్లో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. గత నాలుగు విడతల్లో చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. పట్టణాలతో సమానంగా భూములు, ప్లాట్ల ధరలు పెరిగగా, పల్లె వాసుల అవసరాలు తీరుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్, రైతు వేదిక, వైకుంఠధామం, సీసీ రోడ్లు, అందుబాటులోకి రాగా, సెంట్రల్ లైటింగ్ సిస్టం, విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో..
తెలంగాణ సర్కారు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు పల్లె ప్రగతి నాలుగు, పట్టణ ప్రగతి మూడు విడుతలుగా చేపట్టింది. సత్ఫలితాలు ఇవ్వడంతో మరోసారి కొనసాగించడానికి చర్యలు తీసుకుంటున్నది. ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పచ్చదనం పెంపొందడంతోపాటు పరిశుభ్రతంగా మారి అరోగ్య గ్రామాలుగా మారాయి. పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు పంపిణీ చేయడంతో చెట్లకు నీరు పట్టడం, చెత్తను తీసుకెళ్లడం వంటి వాటిని చేస్తున్నారు. లక్షలు వెచ్చించి పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లు, బావులను పూడ్చారు. వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి ఎల్ఈడీ బల్బులను అమర్చారు. తడి, పొడి చెత్తను సేకరించడానికి ట్రై సైకిళ్లను అందించారు. సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించి చెత్తతో ఎరువులు తయారు చేసి ఆదాయం పొందతున్నారు.
పంచాయతీలకు ఆదాయం
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతున్నది. గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తతో సెగ్రిగేషన్ షెడ్లలో వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. రైతులు సాగులో భాగంగా ఎరువులను వాడుతున్నారు. పంచాయతీలు 50 కిలోల సేంద్రియ ఎరువు బ్యాగును రూ.1000కి విక్రయిస్తున్నాయి. ట్రాక్టర్ల ద్వారా కూడా పంచాయతీలకు ఆదాయం వస్తున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు వానకాలం మినహా, మిగతా తొమ్మిది నెలలపాటు నీటిని అందించాలి. రోడ్డు వైపు ఉన్న మొక్క ఒక్కంటికి రూ.1.80, ఇతర ప్రాంతాల్లో మొక్కలకు రూ.1.20 చొప్పున ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తాయి. ప్రతి పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను పంపిణీ చేసింది. ట్యాంకర్ ద్వారా పంచాయతీ సిబ్బంది మొక్కలకు నీటిని అందిస్తున్నారు.
లోకేశ్వరం మండలం కాండ్లీలో సెగ్రిగేషన్ షెడ్డు
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో మొత్తం 396 గ్రామపంచాయితీలు ఉండగా, అన్ని గ్రామాల్లో ఇప్పటికే వైకుంఠ ధామాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రతి రోజు గ్రామంలో సేకరించిన చెత్తను ఒక చోట డంపు చేసి సేంద్రియ ఎరువుగా మార్చేందుకు అవసరమైన సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. ఇందుకోసం ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ. 2.50లక్షలను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ డంప్ యార్డుల నిర్మాణానికి రూ.10కోట్ల నిధులను వెచ్చించారు. గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆహ్లాదం కోసం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టంను కూడా ఏర్పాటు చేయడంతో ఆయా గ్రామాలు రాత్రిపూట విద్యుద్దీపాలతో వెలిగి పోతున్నాయి. అలాగే రైతులు తాము పండించుకున్న పంటలను ఆరబోసేందుకు పంట కల్లాలను నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా 2497 కల్లాలు మంజూరవగా, వీటిలో 1800 వరకు పూర్తి కాగా మరో 697 నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే గ్రామాల్లో రైతులు సమావేశమయ్యేందుకు నిర్మించిన రైతువేదికలు… తమ సమస్యల పరిష్కారానికి వేదికగా మారాయి.
రూ.218కోట్ల నిధులు మంజూరు..
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు మంజూరయ్యాయి. గత మూడేం డ్ల కాలంలో జిల్లాకు రూ. 218 కోట్లు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 2019-2020 సంవత్సరానికి రూ.60కోట్లు, 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ.85 కోట్లు, 2021-2022 సంవత్సరానికి రూ. 73కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో ప్రధానంగా డ్రైనేజీల నిర్మాణం, అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, తాగునీటికి సంబంధించి మరమ్మతు పనులు చేపట్టారు. అంతే కాకుండా పంచాయతీల్లో కరెంటు చార్జీలు, ట్రాక్టర్ల రుణాలు చెల్లించడం, పారిశుధ్య పనులకు అధిక మొత్తంలో నిధులు వినియోగించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా నిధులు…
పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చాలా మార్పు వచ్చింది. ఈ కార్యక్రమం కింద ప్రతీ నెలా రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేస్తున్నది. ఈ నిధులతో అన్ని గ్రామాల్లో అభివృధ్ది పనులను చేపడుతున్నాం. డ్రైనేజీల నిర్మాణంతో పాటు, అవసరమైన చోట మట్టి, సీసీ రోడ్లను నిర్మించాం. దీంతో గ్రామాల్లోని రోడ్లు అద్దాల్లా మెరవడంతోపాటు, హరితవనంలా గ్రామాలు కనిపిస్తున్నాయి.
–వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారి,నిర్మల్
కల్లాల ఏర్పాటుతో ఖర్చులు తగ్గాయి..
ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన పంట కల్లాలతో మాకు ఎంతో మేలు జేసింది. పంట చేలల్లోనే కల్లాలు ఏర్పాటు చేసుడు బాగుంది. దీంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, వర్షం నుంచి పంటలను కాపాడుకోగలు గుతున్నం. రైతువేదికలతో సాగుపై రైతులందరూ కలిసి సమష్టి నిర్ణయం తీసుకుంటున్నం. టీఆర్ఎస్ వచ్చాకే మా ఇబ్బందులన్నీ పోయినయ్.
–కే. పద్మాకర్, రైతు మేడిపల్లి
హాజీపూర్ మండలం రాపల్లిలోని నర్సరీలో క్కలకు నీరు పోస్తున్న దృశ్యం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి సత్ఫలితాలను అందిస్తున్నది. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే పల్లెలు ఆరోగ్యంగా ఉంటాయని భావించిన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 335 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. దీనిద్వారా మౌలిక సమస్యలకు పరిష్కారం లభించింది.