ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు
తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాం,గుడిహత్నూర్ మండలం సీతాగోందిలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్బాపురావు, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు పాల్గొన్నారు.
హాజీపూర్, జూన్ 15 : గ్రామాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని మంచిర్యాల డీపీవో నారాయణ రావు సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంతో పాటు టీకన్నపల్లె, దొనబండ గ్రామాల్లో శ్రమదానం కార్యక్రమాలను నిర్వహించారు. మండల కేంద్రంలో శ్రమదానంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాల శుభ్రతపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూపాక రాజేశ్వరి-ధర్మయ్య, మండల రైతు బంధు సమితి కో-కన్వీనర్ పుస్కూరి శ్రీనివాస్ రావు, దొనబండ సర్పంచ్ జాడి సత్యం, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి-రవి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, కారోబార్ ప్రభాకర్ తదితరులున్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. 31 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. మండలంలోని లింగన్నపేట, ఎదుల్లబంధం, సిర్సా గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో కే భాస్కర్, ఎంపీవో అక్తర్ మొహియొద్దీన్ పరిశీలించారు. పల్లె ప్రగతి నిర్వహణపై సర్పంచ్ దాగామ రాజు, పంచాయతీ కార్యదర్శి సద్దనపు శిల్పాచారికి సూచనలు చేశారు. మండలంలోని ఎడగట్ట గ్రామంలో సర్పంచ్ కాయిత మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి రాళ్ళబండి సంతోష్ కుమార్, ఎసన్వాయిలో సర్పంచ్ భూక్యా సీమా నాయక్, పంచాయితీ కార్యదర్శి తాజొద్దీన్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు.
చెన్నూర్ పట్టణంలో..
చెన్నూర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పర్యటించారు. వార్డుల్లోని పలు సమస్యలను గుర్తించారు. మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేసి పారిశుధ్య పనులు చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించి, వీధి దీపాలను ఏర్పాటు చేశారు.
తాండూర్ : పారిశుధ్య పనులు పరిశీలిస్తున్న ఈవో
కోటపల్లి : లింగన్నపేటలో నర్సరీని పరిశీలిస్తున్న ఎంపీవో
సీసీసీ నస్పూర్ :పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్
తాండూర్ మండలంలో..
మండలంలో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఆయా పంచాయతీల్లో డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు పరిశీలించారు. పారిశుధ్య పనులు పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, వెలుగు సీఏలు, యువకులు, ప్రజలు, తదితరులున్నారు.
వార్డుల్లో నాయకులు, అధికారుల పర్యటన
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని 17, 18, 31 వార్డుల్లో నాయకులు, అధికారులు పర్యటించారు.18, 31 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ, ఏఈ నర్సింహస్వామి, టీపీవో సత్యనారాయణ, కౌన్సిలర్లు పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం అంశాలకు సంబంధించి అక్కడి ప్రజలు వారికి తెలిపారు. వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
కాసిపేట మండలంలో..
మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సంయుక్తంగా గ్రామాల్లో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ తీశారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను ఎంపీడీవో ఎంఏ అలీం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ దేవి, ఆయా పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎల్కంటిలో క్రీడా ప్రాంగణానికి భూమి చదును
జైపూర్, జూన్ 15: మండలంలోని ఎల్కంటి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు భూమిని గుర్తించి చదును చే యించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్టి పట్టణంలో..
మున్సిపాలిటీలో 10, 21, 34 వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, కమిషనర్ గంగాధర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చంద్రశేఖర్, రాజనాల కమల, నాయకులు రాజనాల రమేశ్, మధు, సరేశ్, శ్రావణ్, తిరుపతి, ఏఈ సందీప్, టీవో ఆశ్రిత్, శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, మిషన్ భగీరథ, విద్యుత్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వేమనపల్లి మండలంలో..
సూరారంలో పారిశుధ్య పనులు, క్రీడా ప్రాంగణ పనులను ఎంపీడీవో లక్ష్మయ్య పరిశీలించారు. కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచు రమేశ్గౌడ్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, కార్యదర్శులు రాకేశ్, సంతోష్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేట పట్టణంలో..
లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 6, 9వ వార్డుల్లో పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ పరిశీలించారు. వార్డు ప్రజలకు పరిశుభ్రత, హరితహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, పీఆర్ ఏఈ శృతి, రాకేశ్, మల్లేశ్, కౌన్సిలర్లు ఇన్చార్జిలు ఉన్నారు.
నస్పూర్ పట్టణంలో..
నస్పూర్ మున్సిపాలిటీలో 22 వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వార్డు కౌన్సిలర్ వంగ తిరుపతి, కమిషనర్ రాజలింగు ఆయా వాడల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని 25 వార్డుల్లో పచ్చదనం, పరిశుభ్రత, వీధి దీపాలు, ఆట స్థలాలు, తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్మిల్ల అన్నపూర్ణ, నాయకులు ఎంబడి సమ్మయ్య, మేడం తిరుపతి, పెరుమాళ్ల జనార్దన్, పెద్దపల్లి వెంకటేశ్వర్లు, వడ్లకొండ రవి, నూనె సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
చిత్తాపూర్లో శ్రమదానం
నెన్నెల, జూన్15: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిత్తాపూర్లో సర్పంచ్ బత్తిని పద్మ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. గ్రామంలోని రోడ్లను చీపుర్లతో శుభ్రం చేశారు. చెత్తా చెదారం ఎత్తి ట్రాక్టర్ ద్వారా డంప్ యార్డుకు తరలించారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. శ్రమదాన కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువకులు మహిళలు పాల్గొన్నారు.