భైంసాటౌన్, మార్చి 25 : అందరికీ అన్నం పెట్టే మహనీయుడు సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనియాడారు. భైంసా మండల ఐకేపీ సంఘాల మహిళలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రూ.8 లక్షలతో నిర్మించిన గోదాంను శనివారం డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీపీ కల్పన జాదవ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో 11ను జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహిళా సమాఖ్య భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి సెర్ప్ ఉద్యోగులతో కలిసి పాలాభిషేకం చేశారు. హైబీస్ ఉమెన్స్ లీడర్ షిప్ అవార్డులో భాగంగా ఉత్తమ ప్రభుత్వ అధికారిగా అవార్డు దక్కించుకున్న డీఆర్డీవో విజయలక్ష్మిని ఎమ్మెల్యే, ఎంపీపీ, సెర్ప్ ఉద్యోగులు పూలమాల, శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మహిళా అధికారి తన ఆధీనంలో ఉన్న మూడు శాఖలను (ఈజీఎస్, ఐసీడీఎస్, ఐకేపీ) సమర్థవంతంగా నిర్వహించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. బీఆర్ఎస్ మహిళల ఉన్నతి కోసం పాటు పడే ప్రభుత్వమన్నారు.
భవిష్యత్లో మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరం భైంసా మండల మహిళా సమాఖ్య సంఘం సభ్యులు ట్రాక్టర్ కొనుగోలు చేయగా.. ఖర్చులన్నీ పోనూ దాని ద్వారా రూ.80 వేల లాభం పొందారని ప్రశంసించారు. భైంసా మండల మహిళా సంఘాలకు రుణాల వడ్డీ రూ.98.33 లక్షలను ప్రభుత్వం ఖాతాలో జమయ్యాయని, ఇందుకు సంబంధించిన చెక్కును సంబంధిత అధికారులు, సంఘం సభ్యులకు అందజేశారు. నియోజకవర్గంలో పంటల నిల్వకు కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయని, స్థల ఎంపిక చేసి త్వరలో నిర్మాణం చేపడుతామన్నారు. దౌనెల్లి, మర్లగొండ గ్రామాలకు త్వరలో ఫోన్ సిగ్నల్స్ కోసం టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
డీఆర్డీవో మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు రుణాల మంజూరులో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కష్టపడి పనిచేసే అధికారులను ప్రోత్సహించేలా మీడియాలో కథనాలు రాయాలని కోరారు. చిన్న చిన్న లోపాలుంటే వెంటనే సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. సెర్ప్ ఉద్యోగులు మాట్లాడుతూ.. పే స్కేల్ కోసం మొదటగా అసెంబ్లీలో ప్రస్తావించి జీవో జారీకి కారణమైన ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి రాబోయే తరాలు కూడా రుణపడి ఉంటాయని, తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోపాలకృష్ణా రెడ్డి, ఏపీడీ భోజన్న, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, నారాయణ్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు గజానంద్, నాయకులు గణేశ్ పాటిల్, మేరాజ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.