కేస్లాపూర్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా, భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సోమవారం వనంలో ఎటు చూసినా జనమే కనిపించారు. మెస్రం వంశస్తులు సంప్రదాయ డోలు, కాలికోమ్, సన్నాయి వాయిద్యాలతో హోరెత్తించారు. గంటల తరబడి బారులు తీరి అమ్మవా రిని దర్శించుకున్నారు. పెర్సపేన్, బాన్ దేవతలకు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించి సహపంక్తి భోజనాలు చేశారు. ఇక నేడు(మంగళవారం) ప్రజా దర్బార్ నిర్వహించ నుండగా, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు.
– ఇంద్రవెల్లి, జనవరి 23
ఇంద్రవెల్లి, జనవరి23 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో ఈ నెల 21న అర్ధరాత్రి మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనంతో వనమంతా కిక్కిరిసిపోయింది. గంటల తరబడి క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలతో పాటు జాతరలో వెలిసిన వివిధ దుకాణాలు, రంగుల రాట్నాల వద్ద జనసందోహం కనిపించింది. విజయ డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు శ్యామ్నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు వారిని శాలువాతో సన్మానించి నాగోబా ఫొటోను బహూకరించారు.
పెర్సపేన్కు ప్రత్యేక పూజలు
నాగోబా ఆలయం వెనుక భాగంలో ఉన్న పెర్సపేన్ దేవతకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. డోలు, సన్నాయిలు, కాలికోమ్ వాయిద్యాల నడుమ మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్తో పాటు మెస్రం వంశీయుల పటేళ్లు చిన్నుపటేల్, బాజీరావ్పటేల్ ఆధ్వర్యంలో కోసు కటోడ, కటోడ కోసేరావ్, కటోడ హనుమంత్రావ్ పెర్సపేన్(పెద్దదేవుడు)కు సంప్రదాయ పూజలు చేశారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో పెద్దదేవుడు(పెర్సపేన్)కు జలాభిషేకం చేశారు. సామూహికంగా నైవేద్యాలు సమర్పించారు. అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు.
బాన్దేవతకు..
బాన్దేవతలకు మెస్రం వంశీయు మహిళల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. గోవాడ్లో విశ్రాంతి పొందుతున్న మహిళలతో పాటు భేటింగ్ చేసిన కొత్తకోడళ్లను నాగోబా ఆలయం వెనుక భాగంలో ఉన్న సతీదేవతల వద్దకు తీసుకొచ్చారు. కొత్తకోడళ్లు మట్టికుండలతోపాటు బిందెలను తలపై పెట్టుకొని మర్రి చెట్లవద్దకు చెరుకొని పురాతన బావి(నీటికోనేరు)కు పూజలు చేశారు. కోనేరు నుంచి అల్లుళ్లు నీటిని తోడి మట్టికుండలతో పాటు బిందెల్లో పోయగా, మహిళలు మట్టికుండలను తలపై ఎత్తుకొని మర్రిచెట్ల నుంచి బాన్దేవతల వద్దకు చేరుకున్నారు. బురదమట్టితో బాన్దేవతలను తయారు చేశారు. ఏడు వరుసలతో కూడిన బాన్దేవతను తయారు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
నాగోబా చరిత్రపై అవగాహన
నాగోబా ఆలయంలో భేటింగ్ నిర్వహించిన కొత్తకోడళ్లకు గోవాడ్లో నాగోబాతో పాటు మెస్రం వంశీయుల చరిత్ర, సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. గోవాడ్లో మెస్రం వంశీయుల మహిళలతో పాటు భేటింగ్ ఆయిన కొత్తకోడళ్లకు మెస్రం వంశీయుల సంప్రదాయలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పర్ధాంజీలు మెస్రం రాము, గంగారాం కిక్రి వాయిస్తూ పాటలతో పాటు గాయన్రూపంలో నాగోబా చరిత్రతోపాటు సంస్కృతిని వివరించారు.
15 ఏండ్ల తర్వాత..
నాగోబాకు మొక్కు చెల్లించుకునే అవకాశం 15 ఏండ్ల తర్వాత వచ్చిందని గాయికి కితకు చెందిన మెస్రం శేఖర్బాబు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నాగోబా జాతర సందర్భంగా గాయికి కితకు చెందిన మెస్రం వంశీయులు మొక్కులు చెల్లించుకోవడానికి అవకాశం దక్కలేదని తెలిపారు. ఈ సంవత్సరం నాగోబా దేవత ఆశీస్సులతో మా గాయికి కితకు అన్ని రకాలు కలిసి రావడంతో 100 మంది కొత్తకోడళ్లకు భేటింగ్ చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఏర్పాటు
నాగోబా జాతరను పురస్కరించుకొని ప్రభుత్వ శాఖల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వాటిలోని పరికరాలతో పాటు వస్తువులను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కావాల్సిన వారు కొనుగోలు చేస్తున్నారు.
సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో..
మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మినరల్ వాటర్ను ఏర్పాటు చేశారు. జాతరలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచితంగా మినరల్ వాటర్ను అందిస్తున్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. డీఎల్పీవో భిక్షపతిగౌడ్ ఆధ్యర్యంలో 5 బృందాలను ఏర్పాటు చేసి పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.
నేడు ప్రజాదర్బార్
నాగోబా జాతర సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో యేటా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. నేడు జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆదివాసీ గిరిజనులకు మంజూరు చేసిన సంక్షేమ పథకాలను అక్కడే పంపిణీ చేస్తారు.